ప్రధాని పదవికి రాజపక్సే రాజీనామా...కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే..?
శ్రీలంకలో రోజురోజుకు రాజకీయ అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదేశ ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైనప్పటికీ రాజపక్సే ప్రధాని పదవిలో కొనసాగారు. కొలంబోలోని తన నివాసంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను అధ్యక్షుడికి పంపారు. అంతేకాదు యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం కూటమిలోని ప్రజాప్రతినిధులకు తను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారని ఎంపీ షెహాన్ సీమసింఘే మీడియాకు తెలిపారు.
దేశ ప్రధానిగా రణిల్ విక్రమ సింఘేను తొలగించి ఆదేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు అధ్యక్షుడు సిరిసేన. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు బలనిరూపణలో ఫెయిల్ అయినప్పటికీ ప్రధాని పదవిలో కొనసాగడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే రాజపక్సే ప్రధానిగా కొనసాగడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజపక్సేను ప్రధానిగా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసుపై పూర్తి వాదనలు వినేంత వరకు రాజపక్సే ప్రధానిగా కొనసాగడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కోర్టు. అంతేకాదు సిరిసేన పార్లమెంటు రద్దు చేయడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది.
శుక్రవారం మహిందా రాజపక్సే అధ్యక్షుడు సిరిసేనను కలిసి తను రాజీనామా చేస్తున్నట్లు తెలిపి కొత్త ప్రభుత్వంను అపాయింట్ చేయాల్సిందిగా కోరినట్లు రాజపక్సే సన్నిహితుడు లక్ష్మణ్ యాన అబేవర్దన్ తెలిపారు. రాజపక్సే రాజీనామా తరువాత రణిల్ విక్రం సింఘే తిరిగి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు సిరిసేన కూడా విక్రమసింఘేను తిరిగి ప్రధానిగా నియమించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు.