ప్రసంగానికి రూ. కోటి: మిలియనీర్ల జాబితాలో చేరిన మలాలా!
లండన్: పాకిస్థాన్లో బాలికల విద్యా హక్కు కోసం పోరాడి, ఉగ్రవాదుల దాడిలో తీవ్ర గాయాలపాలై లండన్ చేరిన సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్. ఆమెను నోబెల్ బహుమతి కూడా వరించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆమె పేరు తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు. కాగా, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. మాలాలా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు. ఆత్మకథ పుస్తకం, ప్రసంగాల ద్వారా వచ్చే ఆదాయంతో నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్.. కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు.
పాకిస్థాన్ స్వాత్ లోయలో తాలిబన్ల హయాంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేస్తూ తన జీవితంపై ఆమె 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం ప్రచురణ హక్కులను సంరక్షిస్తున్న సంస్థ 'సలార్జాయ్' ఖాతాలో ఆగస్టు 2015 నాటికి రూ.19.98 కోట్లు (2.2 మిలియన్ పౌండ్లు) ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
సలార్జాయ్ సంస్థకు మలాలా తండ్రి జియాయుద్దీన్ యుసఫ్జాయ్, తల్లి తూర్ పెకాయ్ సంయుక్త భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ పుస్తకం ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల ప్రతులు అమ్ముడుపోయినట్లు సమాచారం.
అంతేగాక, ప్రస్తుతం పలు దేశాల్లో పర్యటిస్తున్న మలాలా.. ఒక్క ప్రసంగం చేసేందుకు రూ.1.02 కోట్లు (1.14 లక్షల పౌండ్లు) వరకూ తీసుకుంటూ అత్యధికంగా సంపాదిస్తున్న నోబెల్ బహుమతి గ్రహీతల్లో ఒకరిగా మారినట్లు ఓ బ్రిటన్ పత్రిక వెల్లడించింది.