ప్రధాని పదవి వస్తే వద్దనను: మలాలా ఆశలు, బెనజీర్ భుట్టో ఆదర్శం
ఓస్లో: నోబెల్ బహుమతి అందుకుంటున్న పాకిస్తాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నారు! బుధవారం నాడు నోబెల్ శాంతి బహుమతి తీసుకునే ముందు బీబీసీతో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్కు ఎప్పుడో ఒకప్పుడు ప్రధానిని కావాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తాను తన దేశానికి ఎంతో సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ను అభివృద్ధి చేయడమే తన కల అన్నారు. ప్రతి పిల్లలు చదవుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
తనకు దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో ఆదర్శమని చెప్పారు. భుట్టో రెండుసార్లు పాకిస్తాన్ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఈ సందర్భంగా మలాలా మాట్లాడుతూ.. రాజకీయాల ద్వారా తాను తన దేశానికి సేవ చేసే అవకాశం వస్తే, తాను ప్రధాని అయ్యే అవకాశం వస్తే.. దానిని తప్పకుండా చేపడతానని చెప్పారు.
ఈ నోబెల్ శాంతిబహుమతి తనకు ఎంతో ముఖ్యమని ఆమె చెప్పారు. తన పైన ఎన్నో ఆశలతో దీనిని అందిస్తున్నారని చెప్పారు. తనతో ఎంతోమంది ఉన్నారని ఆమె చెప్పారు. ఇది ఎంతో బాధ్యతాయుతమైనదని ఆమె చెప్పారు. తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.
కాగా, నోబెల్ శాంతి బహుమతి విజేతల సమావేశం ఓస్లోలో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భారత్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పాకిస్థాన్ నుంచి మలాలా యూసఫ్ జాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యార్థి కైలాశ్ మాట్లాడుతూ నోబెల్ బహుమతి అందుకోవడం గొప్ప అవకాశమని అన్నారు. ఈ బహుమతి తన బాధ్యతలను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనుగడ కోసం కోట్లాది మంది బాలలు పోరాడుతున్నారని తెలిపారు. మలాలా తన కూతురు లాంటిది.. ఆమెంటే తనకెంతో గౌరవమని చెప్పారు. బాలలను రక్షించాల్సిన నైతిక బాధ్యత తమందరిపై ఉందన్నారు.
మలాలా మాట్లాడుతూ.. సత్యార్థి తనకు ప్రేరణ కలిగించారని, ఆయనతో నోబెల్ శాంతిబహుమతి కలిసి పంచుకోవడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కాలం పిల్లలకు ఐపాడ్ అవసరం లేదని, పుస్తకాలు ఉంటే చాలన్నారు. మార్పు కోసం అందరు గొంతెత్తాలన్నారు.
బుధవారం కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్ సంయుక్తంగా పురస్కరాన్ని అందుకుంటున్నారు. 2014 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్దాన్ బాలిక మాలాలా యూసఫ్ జాయ్, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్దిలకు ఈ బహుమతి సంయుక్తంగా 'రాయల్ కాడమీ ఆఫ్ స్వీడిష్' ప్రకటించిన విషయం తెలిసిందే.
విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి. 17ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించింది.
నోబెల్ అందుకున్న సత్యార్థి, మలాలా
ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా మలాలా మాట్లాడుతూ.. నోబెల్ అందుకోవడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా ఉగ్రవాదానికి బలికావొద్దన్నారు. బాలికల విద్యాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు.