భారతీయుడు సత్యార్థికి, పాకిస్తాన్ మలాలాకు నోబెల్
న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్దాన్ బాలిక మాలాలా యూసఫ్ జాయ్, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్దిలకు ఈ బహుమతి సంయుక్తంగా 'రాయల్ కాడమీ ఆఫ్ స్వీడిష్' ప్రకటించింది.
విదీష ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్ధి బచ్పన్ బచావో ఆందోళన్ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. 80 వేల మంది బాలలను రకరకాల అణచివేతల నుంచి రక్షించారు. భారత్లో నోబెల్ బహుమతి అందుకోనున్నఏడవ భారతీయుడు కైలాస్ సత్యార్ధి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని అందుకోవడం సంతోషంగా ఉందని బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్ది అన్నారు. బాలల హక్కులను పరిరక్షించినందుకే నోబెల్ బహుమతి వచ్చిందని తెలిపారు.
17ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించింది. గతంలో పాతికేళ్ల వయసులో భౌతిక శాస్త్ర వేత్త నోబెల్ బహుమతి పొందిన లారెన్స్ బ్రాగ్ పేరున ఉన్న రికార్డు మాలాలా సొంతం చేసుకోనుంది.
మొదటిసారి దాయాదిదేశాలైన భారత్, పాకిస్దాన్ అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా గెలుపొందాయి. ఇందులో ఒకరు రెండున్నర దశాభ్దాలుగా ఉద్యమబాట పట్టిన వ్యక్తి కాగా, మరొకరు తన అనుభవాలతో సమస్య తీవ్రతను గుర్తించి.. పరిష్కారం దిశగా కృషి చేసిన 17 ఏళ్ల బాలిక.
లక్షల మందికి చదువు ఎంత కష్టపడితేకానీ సమకూరదో తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఎదుర్కొన్న సాహసోపేత అనుభవాన్ని ప్రపంచంలోని నిరక్షరాస్యులైన బాలలందరికీ తెలియచేయాలని తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో విడుదల చేసింది.
2012 అక్టోబర్లో వాయువ్య స్వాత్ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి) ముష్కరులు తలపై కాల్చారు. అదే సమయంలో ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. బాలికల విద్యా కోసం పోరాడినందుకు ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడారు. అనంతరం మాలాలకు లండన్ని ఓ ఆస్పత్రిలో చికిత్స జరగగా అక్కడే కోలుకుంది.
మాలాల కుటుంబం ప్రస్తుతం వెస్టుమిడ్ లాండ్స్ లో ఉంటున్నారు. తండ్రి పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో విద్యావిభాగంలో నియామకమయ్యారు. బిబిసి ఉర్దూ సర్వీస్ బ్లాగ్లో మాలాలా రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో బిబిసిలో వచ్చిన ఆమె ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన పాపులారిటీతో మాలాల నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది. తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె నిరుడు ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్నారు. కాగా, మలాలా, కైలాస్ సత్యార్థిలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మలాలాకు అభినందనలు తెలిపారు.