మర్చిపోలేను: పాక్లో పర్యటిస్తూ మలాలా కంటతడి
ఇస్లామాబాద్: కొన్నేళ్ల తర్వాత స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని నోబెల్ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్జాయ్ అన్నారు. తనపై దాడి జరిగిన తర్వాత తొలిసారి గురువారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు మలాలా. ఆమెకు పాకిస్థాన్లో ఘనస్వాగతం లభించింది.
రాజధాని ఇస్లామాబాద్లో ప్రధాని షాహిద్ అబ్బాసీతో మలాలా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అబ్బాసీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో దేశాన్ని వీడి, ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మలాలా స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మలాలా.. 'ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఇప్పటికి నేను దీన్ని నమ్మలేకపోతున్నాను' అని కంటతడి పెట్టారు. సాధారణంగా తాను ఏడవనని, వయస్సులో చిన్నదాన్నే అయినా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు.
ప్రస్తుత సమాజంలో బాలికల విద్య ఆవశ్యకత, మలాలా పౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి ఆమె ప్రస్తావించారు. పాకిస్థాన్లోని బాలికలందరూ విద్యను అభ్యసించాలని అన్నారు. ఇందుకోసం తాను కృషి చేస్తానని చెప్పారు. 2012లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను పాక్ ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం బ్రిటన్కు పంపింది. చికిత్స పొందిన మలాలా.. అప్పట్నుంచి లండన్లోనే ఉంటున్నారు.