అమెరికా బాంబు దాడి: మలయాళీ ఐఎస్ ఉగ్రవాది మృతి
కాసర్గాడ్: గత సంవత్సరం కేరళ నుంచి కన్పించకుండా పోయిన 21మందిలో ఓ యువకుడు అఫ్గాన్లో మృతిచెందాడు. ఉగ్రవేటలో భాగంగా అమెరికా జరిపిన భారీ బాంబుదాడిలోనే ఇతడు మరణించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఆ దాడిలోనే మృతి చెందినట్లు ధృవీకరించలేదు.
ఐఎస్లో చేరిన కేరళ యువకుడు మృతి
భారత ముస్లిం లీగ్ యూనియన్ లీడర్ అబ్దుల్ రహిమాన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పడన్నా ప్రాంతానికి చెందిన ముర్షీద్ మహ్మద్(27) ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన డ్రోన్ దాడిలో మరణించారు.
ఎక్కడ చనిపోయాడో తెలియదు..
సోషల్మీడియా ఆఫ్ టెలిగ్రామ్ ద్వారా అఫ్గాన్ నుంచి తనకు గురువారం సమాచారం వచ్చిందని రహిమాన్ పేర్కొన్నారు. అయితే ముర్షీద్ ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడన్నది మాత్రం తనకు సమాచారం రాలేదని చెప్పారు.
ఐఎస్లో చేరిన 21మంది యువకులు
గత సంవత్సరం కేరళ నుంచి 21 మంది యువకులు కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. వారంతా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు.
అమెరికా జరిపిన బాంబు దాడిలోనేనా?
మరోవైపు అఫ్గాన్లోని ఇస్లామిక్ స్థావరాలపై అమెరికా గురువారం అతిపెద్ద బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్గాన్ వెల్లడించింది. దీంతో ముర్షీద్ చనిపోయింది ఈ దాడిలోనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై తమ వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదని పోలీసులు స్పష్టం చేశారు.