అవి ఎంహెచ్ 370 విమాన శకలాలే
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 శకలాలు లభ్యమైనట్లుగా మలేషియా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూన్ నెలలో టాంజానియోలో పెంబా ద్వీపం తీర ప్రాంతంలో శకలాలు లభ్యమయ్యాయని, అవి ఎంహెచ్ 370వేనని తెలిపింది.
ఎంహెచ్370 విమానం 2014 మే నెలలో 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతయింది. సముద్రంలో పడిపోయిన ఈ విమానం ఆచూకీని ఇప్పటి దాకా గుర్తించలేకపోయారు. విమాన శకలాల కోసం దాదాపు రెండేళ్లు గాలించారు. అక్కడక్కడా కొన్ని శకలాలు లభ్యమవుతూ వచ్చాయి.
అయితే జూన్లో దొరికిన పెద్ద శకలం మాత్రం ఆ విమానందేనని మలేషియా అధికారులు తాజాగా ప్రకటన చేశారు. గతంలో ఫ్రెంచ్ ద్వీపంలో దొరికిన శకలం కూడా ఈ విమానందేనని గతంలో దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇంకా మొజాంబిక్, దక్షిణాఫ్రికా, మారిషస్ తదితర ప్రాంతాల్లో దొరికిన విమాన శకలాలను పరిశీలిస్తున్నారు.