ఎంహెచ్370 నాలుగేళ్లుగా ఎదురుచూపు: శకలాలు గుర్తిస్తే రూ.445 కోట్లు
కౌలాలంపూర్: నాలుగేళ్ల క్రితం, 2014 మార్చిలో 239 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మలేషియా విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా మిగిలింది. అదిగో అక్కడ... ఇదిగో ఇక్కడ.. అంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ అది దొరకలేదు.
ఈ విమానం ఆచూకీ గుర్తిస్తే 70 మిలియన్ డాలర్లు అందిస్తామని బుధవారం ఓ అమెరికా కంపెనీతో మలేషియా ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో అత్యాధునిక ఓడ ద్వారా ఈ విమానాన్ని గుర్తించేందుకు రంగం సిద్ధం చేశారు. 90 రోజుల పాటు సాగనున్న ఈ విమాన అన్వేషణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
శకలాలు గుర్తించగలిగితే 70 మిలియన్ డాలర్లు
ఈ విమాన శకలాలను గుర్తించడంలో ఆ కంపెనీ విజయం సాధిస్తే అందుకు గాను దాదాపు 70 మిలియన్ డాలర్లు ఆంటే మన కరెన్సీలో రూ.445 కోట్లకు పైగా ముట్టజెప్పనున్నారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ విమాన శకలాలను గుర్తించేందుకు మలేషియాతో ఒప్పందం చేసుకుంది.
ఆ కంపెనీ ఫెయిల్, దీంత భారీ ఆఫర్
కానీ విమానానికి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో గత ఏడాది జనవరిలో విమానాన్ని అన్వేషించడం ఆపేశారు. ఆ కంపెనీ వెతకడం ఆపివేయడానికి నెలల ముందే మలేషియా ప్రభుత్వం ఇతర కంపెనీలకు ఆఫర్ ఇచ్చింది. విమాన శకలాలను గుర్తిస్తే పెద్ద మొత్తంలో నగదు ఇస్తామని చెప్పింది.
మూడు కంపెనీలు బిడ్
ఇందుకు మూడు కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఒకవేళ విమాన శకలాన్ని గుర్తించకపోతే ఎటువంటి ఫీజు చెల్లించబోమనే ఒప్పందం మీద మలేషియా ప్రభుత్వం ఈ ఆఫర్ ఇచ్చింది. అమెరికాకు చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. కొత్త సెర్చ్ హిందూ మహాసముద్రంలోని 25 వేల చ. కి.మీ. విస్తీర్ణంలో జరగనుంది. 5వేల చ. కి.మీ. విస్తీర్ణంలోనే విమాన శకలాలను గుర్తిస్తే 20 మిలియన్ డాలర్లు సదరు కంపెనీకి అందుతాయి.
స్వాగతించిన ప్రయాణీకుల కుటుంబ సభ్యులు
ఒకవేళ 25 వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలో విమానాన్ని గుర్తిస్తే అప్పుడు 70 మిలియన్ డాలర్లు కంపెనీకి చెల్లిస్తారు. ఎంహెచ్ 370 విమానాన్ని గుర్తించేందుకు మలేషియా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ఆ విమాన ప్రయాణికుల కుటుంబసభ్యులు స్వాగతించారు.
నాలుగేళ్లుగా ఎదురుచూపులు
2014 మార్చి నెలలో ఆ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. మార్గమధ్యలోనే అదృశ్యమైంది. అప్పటి నుంచి దాని కోసం వెతుకుతూనే ఉన్నారు. అందులోని ప్రయాణికులకు సంబంధించిన కుటుంబసభ్యులు తమ వారి జాడ కోసం నాలుగేళ్లగా ఎదురు చూస్తున్నారు.