తప్పుడు వార్తలు రాసినా, ప్రచారం చేసినా.. పదేళ్ల జైలుశిక్ష! ఎక్కడంటే...
కౌలాలంపూర్ : తప్పుడు వార్తలపై చర్యలకు మలేసియా ప్రభుత్వం ఉపక్రమించింది. తప్పుడు వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.
ఈ బిల్లును మలేసియా ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని టార్గెట్ చేశారు. ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై ప్రతిపక్ష ఎంపీ చార్లెస్ సాంటిగో మాట్లాడుతూ.. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం అతిపెద్ద ఆయుధాన్ని ఉపయోగించడానికి రంగం సిద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే మలేసియా ప్రభుత్వం మాత్రం ప్రజా భద్రత కోసమే తాము ఈ చట్టాన్ని తీసుకు రానున్నట్లు చెబుతోంది. పైగా భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఏ మాత్రం ఆటంకం కాబోదని పేర్కొంటోంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక ప్రకారం 'రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్' జాబితాలో మలేషియా 144వ స్థానంలో ఉంది.
ఒకవేళ ఈ చట్టం అమలులోకి వస్తే.. తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్లు( దాదాపు రూ. 84 లక్షలు ) జరిమానా విధిస్తారు. విచిత్రం ఏమిటంటే.. మలేసియా పౌరులు ఈ చట్టాన్ని బయటి దేశాల్లో ఉల్లఘించినా, వారు మలేసియాలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.