పొరుగు దేశంలో పెను రాజకీయ సంక్షోభం: చేతులు మారబోతున్న అధికారం: ప్రధానమంత్రి రాజీనామా
కౌలాలంపూర్: మన పొరుగు దేశం మలేసియాలో పెను రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఏకంగా ఈ దేశ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే స్థాయికి చేరుకుంది. మలేసియా ప్రధానమంత్రి మహతిర్ మహమ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. మరి కాస్సేపట్లో ఆయన మలేసియా చక్రవర్తిని కలిసి.. తన రాజీనామా ప్రతాన్ని అందజేయనున్నారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మలేసియాలో శరవేగంగా పావులు కదులుతున్నాయి.
Recommended Video
మహతిర్ మహమ్మద్ రాజీనామా చేయడానికి గల కారణాలపై వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. రాజకీయ కారణాలే ఈ పరిస్థితికి దారి తీసి ఉండొచ్చని మలేసియా మీడియా వెల్లడించింది. 94 సంవత్సరాల మహతిర్.. 2018లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. యునైటెడ్ మలయాస్ నేషనల్ ఆర్గనైజేషన్ (యుఎంఎన్ఓ) సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.
సంకీర్ణ కూటమిలో చెలరేగిన విభేదాలు, అసమ్మతి, ఇతర కారణాలు రాజకీయ సంక్షోభానికి దారి తీసి ఉంటాయని అంటున్నారు. ఇదిలావుండగా- మలేసియా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన వారసుడిగా మహతిర్ మహమ్మద్ ప్రతిపక్ష నేత పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. మహతిర్ సారథ్యంలోని యుఎంఎన్ఓ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశపూరకంగా అస్థిరపర్చడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని మొత్తంగా రద్దు చేసేయాలని, తాజాగా ప్రజాభిప్రాయాన్ని కోరడానికి ఎన్నికలను నిర్వహించాలనే డిమాండ్ కూడా ఉందని మలేసియా మీడియా పేర్కొంది. మలేసియా చక్రవర్తి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని మొత్తంగా రద్దు చేస్తారా? లేక ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీంను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? అనేది మరి కొన్ని గంటల్లో స్పష్టమౌతుందని అభిప్రాయపడింది.