తిరుగుబాటు..ప్రభుత్వం కూల్చివేత: బందీలుగా దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి: మంత్రుల ఇళ్లల్లో లూటీ
బమాకో: ఆఫ్రికన్ కంట్రీ మాలీలో రాత్రికి రాత్రి సైనికులు, ప్రజా సంఘాలు తిరుగుబాటు లేవనెత్తారు. ప్రభుత్వాన్ని కూలదోశారు. దేశాధ్యక్షుడు ఇబ్రహీం, బౌబాకర్ కీటా, ప్రధానమంత్రి బౌబో కిస్సేను అరెస్టు చేశారు. పలువురు మంత్రులను నిర్బంధించారు. అధికారులనూ వదల్లేదు. అత్యున్నత స్థాయి అధికారులను కూడా బందీ చేశారు. ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. క్రమంగా మాలీలో సైనిక పరిపాలన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సైనికుల డిమాండ్ల మేరకు అధ్యక్షుడు వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఐక్యరాజ్య సమితి ఆందోళన..
మాలీలో చోటు చేసుకుంటోన్న పరిణామాల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమౌతోంది. మాలీ సంక్షోభం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు, ప్రధానమంత్రిని వెంటనే విడిచిపెట్టాలని ఆదేశించింది. ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ మౌసక్సా ఫకీ మహమత్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ఆధునిక ప్రపంచంలో చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను వెంటనే విడిచి పెట్టాలని అన్నారు.
ఆర్మీ బేస్ క్యాంప్లో
మాలీ సైన్యానికి చెందిన కటీ ఆర్మీ బేస్ క్యాాంప్.. ఈ తిరుగుబాటుకు కేంద్రబిందువైంది. రాజధాని బమాకో శివార్లలో ఉంటుందీ కటీ ఆర్మీ బేస్. కొందరు ప్రజా సంఘాల నాయకులతో సైన్యాధికారులు సమావేశం అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ తిరుగుబాటు తలెత్తడానికి నలుగురు సైన్యాధికారులు ప్రధాన కారణమని స్థానిక మీడియా చెబుతోంది. ఈ ఘటన అనంతరం.. సైన్యాధికారులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైందని, తిరుగుబాటు లేవనెత్తిన ఆర్మీ అధికారులతో శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించింది.
సైనిక తిరుగుబాటుతో ఉద్రిక్త
సైనిక తిరుగుబాటు అనంతరం రాజధాని బమాకోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి అధికార నివాసం, ప్రధాని ఇంటి ముందు సైనికులు గుమికూడారు. బమాకోలోని పలు ప్రాంతాలు తుపాకుల శబ్దాలతో మారుమోగిపోయాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టారు. ఈ తిరుగుబాటు పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. పలువురు మాలీయన్లు సైనిక తిరుగుబాటు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ఇబ్రహీం, ప్రధానమంత్రి బౌబో రాజీనామా చేయడాన్ని స్వాగతించారు. ప్రజా వ్యతిరేక పరిపాలనకు తెర పడిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి కుమారుడి ఇళ్లు లూటీ
అదే సమయంలో పలువురు స్థానికులు ప్రధానమంత్రి కుమారుడు కరీమ్ కీటి ఇంటిని దోచుకున్నారు. ఆ సమయంలో ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ లేరు. పలువురు మంత్రుల నివాసాల్లో కూడా స్థానికులు లూటీకి పాల్పడినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. మూడు నెలల కిందటి నుంచే సైన్యాధికారులు తిరుగుబాటు లేవనెత్తడానికి కుట్ర పన్నారని అంటున్నారు. దీని తరువాతే పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ చీఫ్గా ఉన్న కరీమ్ కీటీ రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన రాజీనామా తరువాత ఇక సైన్యాధికారులు ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారని సీఎన్ఎన్ వెల్లడించింది.
సరిహద్దులు మూసివేత..
ఈ ఘటన పట్ల ఆఫ్రికన్ దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పొరుగునే ఉన్న నైజర్ సహా పలు దేశాలు సరిహద్దులను మూసివేశాయి. మాలీలోని పలు దేశాల రాయబార కార్యాలయాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. తమ దేశ పౌరులెవరూ రోడ్ల మీదికి రావొద్దని ఆదేశించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న ప్రజలపై స్థానిక పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం ఉందని, తమ దేశ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఫ్రాన్స్; అమెరికా దేశాల రాయబార కార్యాలయాలు ఆదేశించాయి.