కారు బాంబు ధాటికి.. ముక్కలై పడిన పనామా కేసు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్!
పనామా పేపర్ల కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) సోమవారం అనూహ్యంగా కారుబాంబు పేలుడులో దుర్మరణం పాలయ్యారు.
మాల్టా: పనామా పేపర్ల కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనూహ్యంగా కారుబాంబు పేలుడులో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
సోమవారం ఉదయం ఇంటి నుంచి కారులో బయటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలిపోవడంతో గలిజియా మృతదేహం ముక్కలై పొలాల్లో పడిపోయింది. ఈ ఘటన వెనుక ఉన్నదెవరో ఇంకా తెలియరాలేదు.
పనామా పేపర్ల కుంభకోణం ఆ మధ్యన ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైతం ఈ కుంభకోణం కారణంగానే పదవి పోగొట్టుకోవలసి వచ్చింది.
ఈ పనామా పేపర్ల కేసులో కొంతమంది అగ్రదేశాధి నేతలు కూడా వెలుగులోకి వచ్చారు. సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కేసు విచారణ విభాగంలో గలిజియా మాల్టాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. తన భర్త, పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు.
జర్నలిస్ట్ డాదప్నే కార్వానా గలిజియా దుర్మరణం పట్ల మాల్టా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
విచిత్రం ఏమిటంటే... ప్రధాని ముస్కట్ భార్య, విద్యుత్ శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారంటూ గలిజియా గతంలో కథనాలు రాశారు.