28మందిని పెళ్లి చేసుకున్నాడు.. 25వభార్య ఫిర్యాదుతో వెలుగులోకి..
పుట్టిందే పెళ్లిళ్లు చేసుకోవడం కోసం అన్నట్టు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ నిత్య పెళ్లికొడుకు. పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లు కాపురం చేశాక కట్నం కోసం వేధించడం..
ఢాకా: పుట్టిందే పెళ్లిళ్లు చేసుకోవడం కోసం అన్నట్టు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ నిత్య పెళ్లికొడుకు. పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లు కాపురం చేశాక కట్నం కోసం వేధించడం.. ఇదీ అతగాడి తంతు.
బంగ్లాదేశ్ కు చెందిన యాసీన్ భ్యాపారీ అనే 45ఏళ్ల వ్యక్తిపై అతని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన తానియా.. అతగాడి పెళ్లిళ్ల చిట్టాను పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించింది.
'నాకు ఇదివరకు కేవలం రెండు పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయి..' అని అబద్దాలు చెప్పిన యాసీన్.. మాయ మాటలతో తనను వివాహం చేసుకున్నట్టుగా తానియా పోలీసులకు చెప్పింది. 2011లో వారి వివాహం జరిగినట్టుగా తెలిపింది. కొన్నాళ్లు మామూలుగానే సాగిన కాపురంలో.. కూతురు పుట్టాక తనకు వేధింపులు మొదలయ్యాయని తానియా ఆవేదన చెందింది.
కట్నం కోసం యాసీన్ తనను వేధించడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త పెళ్లాడిన 17మంది యువతుల జాబితాను, వారి పిల్లల వివరాలను ఫిర్యాదు లేఖలో పొందుపరిచింది. కాగా, యాసీన్ రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు, మూడవ భార్యకు ఓ కుమారుడు, ఏడవ భార్యకు ఓ కొడుకు, 24వ భార్యకు ఓ కూతురు పుట్టారని తానియా లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.
యాసీన్ పెళ్లాడిన యువతుల్లో ఎక్కువమంది ఘటిభంగా, చిట్టాగాంగ్ ప్రాంతాలకు చెందినవారే అని తానియా పోలీసులకు వివరించింది. తానియా ఫిర్యాదు మేరకు యాసీన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో యాసీన్ తన 27వ భార్య ఇంట్లో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు పంపి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.