హాయ్ చెప్పి, ఇంటికి పిలిచి, భోజనం పెట్టి .. ఆపై లైంగికదాడి
చండీగఢ్ : తెలిసిన వాళ్ల అబ్బాయే కదా అని నమ్మడమే ఆ విద్యార్థిని జీవితం చిదిమివేయడానికి కారణమైంది. మమ్మీ స్నేహితురాలి కొడుకే కదా అని చనువుగా ఉంటే .. జీవితాన్ని నాశనం చేశాడా యువకుడు. తన గదికి తీసుకెళ్లి .. మత్తుమందు కలిపిన అన్నం పెట్టి .. లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేకపోయిందా విద్యార్థిని.
తెలుసు కదా అని మాట్లాడిస్తే ..
హర్యానాలోని పల్వాల్లో విద్యార్థిని కుటుంబం నివసిస్తోంది. ఆమె తల్లి స్నేహితురాలి కొడుకు కేశవ్ తరచూ విద్యార్థిని కలిసేవాడు. అలా వారి మధ్య మొహ పరిచయం ఉంది. దీనిని అనువుగా మలచుకున్న కేటుగాడు .. విద్యార్థి వెంట పడటం మొదలెట్టాడు. విద్యార్థిని పల్వాల్లో ఇంటర్ పూర్తిచేసింది. డిగ్రీ చేసేందుకు హస్తిన వెళ్లింది. అక్కడ ఓ కాలేజీలో చేరి .. హాస్టల్లో ఉంటుంది. ఆ విద్యార్థిని హాస్టల్ దగ్గరలోనే గది తీసుకొని ఉన్నాడు కేశవ్. తరచూ కలవడం, మాట్లాడటంతో చనువు పెరిగింది. అలా అప్పుడప్పుడు అతని గదికి కూడా వెళ్లేది. అయితే ఓ సారి కూడా వెళ్లి తన జీవితాన్ని నరకకూపంలోకి నెట్టుకుందా విద్యార్థిని
ఇంటికి పిలిచి లైంగిక దాడి ...
గతేడాది విద్యార్థిని ఇంటికి రమ్మని పిలిచాడు కేశవ్. ఎప్పటిలానే వెళ్లింది ఆమె .. కానీ అతని మనసులో కపటత్వాన్ని కనుగొనలేకపోయింది. ఇంటికెళ్లాక భోజనం చేయమని అడగడంతో చేయడమే తప్పైంది. అన్నం తిన్నాక మెల్లగా మత్తులోకి జారుకుంది. అప్పటికే భోజనంలో మత్తు మందు కలిపాడు కేశవ్. మత్తులోకి జారుకున్నాక విద్యార్థినిపై లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమె ఫోటోలు తీశాడు. తర్వాత హాస్టల్కు వెళ్లని విద్యార్థిని జరిగిన ఘటన గురించి తెలుసుకోలేకపోయింది.
ఫోటోలు చూసి ..
అయితే తెల్లవారి కలిసిన కేశవ్ ఫోటోలు చూపించడంతో ఖంగుతింది. వాటిని ఆధారంగా చేసుకొని పలుమార్లు లైంగికదాడి చేశాడు. లైంగికంగా వేధించడమే కాదు .. డబ్బులివ్వాలని కూడా బెదిరించేవాడు. చివరికి కొన్నాళ్లకు ఆమె అతని మాట వినలేదు. దీంతో కోపం వచ్చిన కేశవ్ .. తన వద్ద ఉన్న ఫోటోలను ఏకంగా యువతి తల్లికే పంపించాడు. అప్పటికే ఆమె తెలుసు కాబట్టి ... ఆమె ఫోన్కు పంపించాడు. జరిగిన ఘటన గురించి విద్యార్థి తల్లితో చెప్పి బోరుమంది. దీంతో పేరెంట్స్ కేశవ్ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినికి వైద్య పరీక్షలు చేసి .. లైంగికదాడికి గురైనట్టు నిర్ధారించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.