భారీ చీటింగ్: రూ.1688 కోట్లకు ఫేక్ ఎయిర్ పోర్ట్ను అమ్మేశాడు!! ఎలా ప్లాన్ చేశాడంటే?
Recommended Video
అబుజా: మనం ఎన్నో ప్రాడ్ కేసుల గురించి వింటుంటాం. ప్రభుత్వ భూములను అమ్మడం, ఇతరుల భూములు తమవిగా చెప్పుకొని అమ్మడం.. వంటి ఎన్నో మోసపూరిత కేసుల గురించి విన్నాం. ఇదీ అలాంటి మోసమే. కానీ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఎయిర్ పోర్టును అమ్మేశాడు.
ఓ వ్యక్తి థర్డ్ పార్టీగా ఏకంగా విమానాశ్రయాన్ని దాదాపు రూ.1688 కోట్లకు అమ్మేశాడు. ఈ సంఘటన 1995 - 1998 మధ్య నైజీరియాలో చోటు చేసుకుంది. ఎమ్మాన్యుయెల్ అనే వ్యక్తి ఫేక్ ఎయిర్ పోర్టును బ్రెజిల్కు చెందిన నెల్సన్ సకగుచికి అమ్మాడు.
ఎమ్మాన్యుయెల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా డైరెక్టర్గా అంతకుముందు పని చేశాడు. నెల్సన్ సకగుచి కూడా ఓ బ్యాంకు డైరెక్టర్గా పని చేశాడు.
తన పదవిని ఇలా ఉపయోగించుకున్నాడు
ఎమ్మాన్యుయల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో పత్రాలు, అందుకు సంబంధించిన సమాచారం తెప్పించుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నాడు. ఇలా చేయడం సాధారణ వ్యక్తికి అసాధ్యం.
గవర్నర్గా పరిచయం
ఆ తర్వాత ఎమ్మాన్యుయల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా గవర్నర్ ఒగ్వుమాగా... బ్రెజిల్ వాసి నెల్సన్ సకగుచికతో పరిచయం చేసుకున్నాడు. నైజీరియా ప్రభుత్వం అబుజాలో ఓ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని చెప్పారు. ఈ డీల్ ఎంతో లాభదాయకమైనదని చెప్పాడు.
ఈ డీల్తో ఎంతో లాభమని
ఈ డీల్ ఎంతో లాభదాయకమని నెల్సన్ను ఒప్పించాడు ఎమ్మాన్యుయల్. ఈ డీల్తో 10 మిలియన్ల డాలర్ల లాభం వస్తుందని నమ్మబలికాడు. దీంతో విమానాశ్రయం కోసమై నెల్సన్ 191 మిలియన్ డాలర్లు ఇచ్చాడు. మిగతా మొత్తాన్ని ఔట్ స్టాండింగ్ ఇంటరెస్ట్ కింద ఇచ్చాడు.
నిందితులకు శిక్ష
ఈ కేసులో ఎమ్మాన్యుయెల్కు ఒబుమ్ ఒసాక్వే, జెరిబ్ ఒకోలి, క్రిస్టియన్ ఇకెచుక్వు - అమాకా అనే భార్యాభర్తలు, ఎమ్మాన్యుయెల్ ఒఫోలు(మరో వ్యక్తి) సహకరించారు. దీనిపై 2004లో విచారణ జరిగింది. నిందితులందరిని అబుజా హైకోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. వారిపై 86 ఇల్లీగల్ కేసుల్లో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో వారు ముందస్తుగానే బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మరో 15 కేసులు కూడా ఉన్నాయి. వారు అధికారులకు లంచం ఇచ్చిన కేసులు ఇవి. నిందితులకు కోర్టు అయిదేళ్ల కారాగార శిక్ష, 10 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఆ తర్వాత అతను విడుదలయ్యాడు.