ఆ వ్యక్తి చనిపోయింది ఉల్క వల్ల కాదు: నాసా
న్యూయార్క్: ఇటీవల తమిళనాడులో చనిపోయిన వ్యక్తి ఉల్క వల్ల కాదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా వెల్లడించింది. శనివారం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ భారీ పేలుడు సంభవించి ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడిన సంగతి తెలిసిందే.
ఆకాశం నుంచి ఉల్క పడడం వల్లే పేలుడు సంభవించి వ్యక్తి చనిపోయాడని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు అది ఉల్క కాదని, భూమి నుంచే ఏదో పేలుడు సంభవించి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు బుధవారం తెలిపారు.
ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం చెప్పిందే నిజమైతే, చరిత్రలో ఉల్క వల్ల ఓ వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి అవుతుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే, పేలుడు నేల మీదే జరిగి ఉంటుందని ఆకాశం నుంచి పడినట్లు అనిపించడం లేదని నాసా తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
వెల్లూరు జిల్లాలోని నటారాంపల్లిలో భారతిదాసన్ ఇంజినీరింగ్ కళాశాలలో గత శనివారం పేలుడు సంభవించడంతో కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ కామరాజ్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తోటపని చేసేవారు గాయపడ్డారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి ఆకాశం నుంచి ఏదో వస్తువు భూమి పడటంతో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నాడు.
దీంతో తమిళనాడు ప్రభుత్వం ఉల్క పడడంతో ప్రమాదం జరిగిందని అధికారిక ప్రకటన చేశారు. ఈ పేలుడు ఘటనలో కాలేజీకి చెందిన భవంతుల అద్దాలతో పాటు బస్సుల అద్దాలు సైతం పగిలిపోయిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నల్లటి రాయి నమూనాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.