వార్నీ.. మరీ ఇంత కక్కుర్తా? ఫెన్సింగ్ ఎక్కి జూలోకి దూకేశాడు.. పులికి ఆహారమైపోయాడు
ఓ వ్యక్తి భార్యాబిడ్డలతో కలిసి జూకెళ్లాడు. ఎంట్రన్స్ టిక్కెట్ కొనడం ఎందుకు దండగ అనుకున్నాడు. ఎవరూ చూడని సమయంలో గభాల్న జూ ఫెన్సింగ్ ఎక్కి లోపలికి దూకేశాడు. ఆ తరువాతే జరిగింది అసలు కథ
బీజింగ్: ఓ వ్యక్తి భార్యాబిడ్డలతో కలిసి జూకెళ్లాడు. ఎంట్రన్స్ టిక్కెట్ కొనడం ఎందుకు దండగ అనుకున్నాడు. ఎవరూ చూడని సమయంలో గభాల్న జూ ఫెన్సింగ్ ఎక్కి లోపలికి దూకేశాడు. ఆ తరువాతే జరిగింది అసలు కథ.. చదవండి!
తూర్పు చైనాకు చెందిన జాంగ్ తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల జేజియాంగ్ ప్రావిన్స్ లోని డాంగ్జియాన్ లేక్ రిసార్ట్ కు సమీపంలోని జూ సందర్శనకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎంట్రన్స్ ఫీజు చెల్లించి.. టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్లిపోయారు.
జాంగ్, అతడి ఫ్రెండ్ మాత్రం ఎంట్రన్స్ ఫీజు ఎందుకు డబ్బు దండగ అనుకున్నారు. ఎవరి కంటా పడకుండా జూలోకి వెళ్లిపోదామని అనుకుని ఫెన్సింగ్ ఎక్కి లోపలికి దూకారు. అయితే వాళ్లు దూకింది టైగర్ జోన్ ప్రాంతంలో అని, అక్కడే టైగర్ ఎన్ క్లోజర్ ఉందన్న విషయం వాళ్లకు తెలియదు.
ఇంకేముంది.. లోపలికి దూకీ దూకడంతోనే ఓ టైగర్ కంట పడ్టారు. అసలే ఆకలిమీద ఉన్న పులి ఊరుకుంటుందా? పంజా విప్పి ఎగిరి జాంగ్ మీదికి దూకింది. పులి దాడికి భయపడిన జాంగ్ స్నేహితుడు దూరంగా పారిపోయాడు.
జూలోని సందర్శకులు కళ్లారా చూస్తూనే ఉన్నారు. కొందరు తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంలో మునిగిపోయారు. చివరికి భార్యా బిడ్డలు చూస్తుండగానే పులి పంజా మీద పంజా విసిరి జాంగ్ ను చంపేసింది.
ఈలోగా ఈ సమాచారం అందిన జూ అధికారులు పరుగు పరుగున వచ్చి జాంగ్ ను చంపిన పులిని కాల్చేశారు. అయినా ఏం ప్రయోజనం? వెధవది ఎంట్రన్స్ ఫీజు దగ్గర కక్కుర్తి పడితే.. ఏకంగా నిండు ప్రాణమే పోయింది.