ఏడాది పాటు ఇంట్లో...: తల్లి పింఛన్ కోసం 62 ఏళ్ల కొడుకు విపరీత చర్య, అరెస్ట్
మాడ్రిడ్: స్పెయిన్లో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం ఓ వ్యక్తి ఏకంగా తన తల్లి మృతదేహంతో ఏడాది పాటు ఇంట్లో ఉన్నాడు. ఏడాది కాలంగా అతను తల్లి పేరుతో పింఛన్ తీసుకుంటున్నాడు. విషయం తెలిసి, పోలీసులు గురువారం అతనిని అరెస్టు చేశారు.
వృద్ధులకు స్పెయిన్ ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. దీని కోసం కొడుకు ఇలా చేశాడు. కన్నతల్లి చనిపోయి సంవత్సరం అయినా ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఈ సంఘటన రాజధాని మాడ్రిడ్లో చోటు చేసుకుంది.
మాడ్రిడ్లోని కారబాంచెల్ ప్రాంతంలో గల ఓ అపార్టుమెంటులో ఇంటి నుంచి గత కొన్ని వారాలుగా విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని దుర్వాసన వెలువడుతున్న ఇంటి తలుపు తట్టారు. ఎవరూ తలుపు తీయలేదు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు.
లోపలకు వెళ్లిన పోలీసులు అక్కడ దృశ్యం చూసి షాకయ్యారు. చెక్కతో తయారు చేసిన ఓ శవపేటికలో వృద్ధురాలి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. ఏడాది కాలంగా ఈ ఇంట్లోని వ్యక్తి తల్లి బయట కనిపించట్లేదని స్థానికులు పోలీసులకు చెప్పారు.
ఇంట్రెస్టింగ్: గోల్డ్ చైన్ కొట్టేసి పారిపోదామనుకున్నాడు.. తీరిగ్గా వచ్చి ఇచ్చేశాడు, ఏం జరిగిందంటే?
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 92 ఏళ్ల ఆ మహిళ ఏడాది కిందటే చనిపోయిందని సమాచారం. తల్లి చనిపోయిందని తెలిసినా ఆమె 62 ఏళ్ల కుమారుడు ఆమె వృద్ధాప్య పింఛను కోసం ఆమె అంత్యక్రియలు చేయలేదని గుర్తించారు. ఆమె బతికే ఉందని చెప్పి ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అతనిని అరెస్టు చేశారు.