ఆక్రమించేస్తున్నారు: భారతీయులపై అమెరికాలో విద్వేష వీడియో కలకలం
ఓహియో శివార్లలోని కొలంబస్ నగర ఉద్యానవనంలో భారతీయుల కుటుంబాలపై రహస్యంగా తీసిన చిత్రాలు, దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. వలసదారుల వ్యతిరేక వెబ్సైట్ ‘సేవ్ అమెరికన్ ఐటీ జాబ్స్.ఆర్గ్’లో .
వాషింగ్టన్: ఇప్పటికే వరుసగా జరుగుతున్న దాడులతో ప్రవాసభారతీయులు, మనదేశంలోని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతుండగా, తాజాగా మరో విద్వేష వీడియో ఇప్పుడు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఓహియో శివార్లలోని కొలంబస్ నగర ఉద్యానవనంలో భారతీయుల కుటుంబాలపై రహస్యంగా తీసిన చిత్రాలు, దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. వలసదారుల వ్యతిరేక వెబ్సైట్ 'సేవ్ అమెరికన్ ఐటీ జాబ్స్.ఆర్గ్'లో ఇది మొదట దర్శనమిచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఉద్యోగాలు ఎత్తుకెళ్లిపోతున్నారు..
సోమవారం నాటికే ఈ వీడియోను యూట్యూబ్లో 41వేల మందికిపైగా వీక్షించడం గమనార్హం. 'అమెరికన్ల ఉద్యోగాలను ఎత్తుకెళ్లిపోతూ.. భారత కుటుంబాలు ఎంత సుసంపన్నంగా ఉన్నాయో చూడండి'అని వీడియో కిందరాసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వెబ్సైట్ను వర్జీనియాకు చెందిన 66ఏళ్ల స్టీవ్ పుషర్ నడుపుతున్నట్లు మీడియా సంస్థ 'బజ్ఫీడ్' వెల్లడించింది.
ఆక్రమించేశారు...
ఈ వీడియోలో.. 'ఇక్కడి విదేశీయుల సంఖ్యచూసి నా మతి చెదిరిపోతోంది. చూడండి అందరూ భారతీయులే. వీరు భారీ స్థాయిలో అమెరికన్ల నుంచి ఉద్యోగాలను తీసేసుకున్నారు. అమెరికాలోని పశ్చిమ-మధ్య ప్రాంతాలను దాదాపుగా ఆక్రమించారు. ఈ ఉద్యానవనం మినీ ముంబైలా కనిపిస్తోంది'అని వ్యాఖ్యానించాడు స్టీవ్ పుషర్.
అందరూ వెళ్లిపోవాలని అనుకోవడం లేదు..
ఒహియో ప్రజలు, ఐటీ నిపుణుల ఉద్యోగాలను విదేశీయులు తీసుకుపోతున్నారనే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నానని వివరించారు. అమెరికాలోని భారతీయులందరూ వెనక్కి వెళ్లిపోవాలని తాను భావించట్లేదని చెప్పుకొచ్చాడు.
భారత ఐటీ సంస్థలపైనా..
'భారత దిగ్గజ ఐటీ మాఫియా సంస్థలు దశాబ్దాలుగా అమెరికా ఐటీ కార్మికులకు హాని చేస్తున్నాయి. ఇవి కొన్ని అత్యాశగల అమెరికా సంస్థలతో కలిసి కుటిల విధానాలను అనుసరిస్తున్నాయి'అని ఆ వెబ్సైట్ రాసుకొచ్చింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, కాగ్నిజాంట్, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్, ఎసెంచర్, టెక్మహీంద్ర, విద్యాటెక్ లాంటి సంస్థలను 'భారత ఐటీ మాఫియా'గా పేర్కొంది. కాగా, గత ఆగస్టులోనే పుషర్ ఈ వీడియో పోస్ట్చేయడం గమనార్హం.