మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో ఘోర అగ్నిప్రమాదం: 18 మంది సజీవదహనం: విద్యార్థులందరూ 16 ఏళ్లలోపే
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమౌతోంది. మరణించిన వారందరూ ఏడు నుంచి 16 సంవత్సరాల్లోపు విద్యార్థులే. మార్షల్ ఆర్ట్స్ను అభ్యసించడానికి ఈ స్కూల్లో చేరారు. అక్కడే నివసిస్తోన్నారు. ప్రమాద సమయంలో 34 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తోన్నారు.
సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్ ఝెఛెంగ్ కంట్రీలోని షాంగ్క్వియు సిటీలో ఉంటుందీ రెసిడెన్షియల్ స్కూల్. చైనా సంప్రదాయబద్ధమైన షావొలిన్ మార్షల్ ఆర్ట్స్ను నేర్పిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్కు హెనన్ ప్రావిన్స్ పెట్టింది పేరు. ఈ ప్రావిన్స్లో ఇలాంటి పాఠశాలలు, కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. షాంగ్క్వియు సిటీలోని ఈ స్కూల్లో పలువురు విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతోన్నారు. అక్కడే నివసించే వారు. ఈ తెల్లవారు జామున ఈ స్కూల్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించాయి. తప్పించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రమాద సమయంలో మొత్తం 34 మంది విద్యార్థులు ఉండగా.. వారందరూ మంటల బారిన పడ్డారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో 18 మంది మరణించగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలు, బొబ్బలెక్కిన శరీరాలతో విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, ప్రకృతి వైపరీత్యాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ మేనేజర్ను అరెస్ట్ చేసినట్లు ఝెఛెంగ్ కంట్రీ పోలీసులు తెలిపారు.