ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేసిన జుకర్ బర్గ్: 'అమెరికా వలసదారుల దేశమే'
అమెరికాది వలసదారుల దేశమని, ప్రపంచంలోని ఉన్నతమైన, ప్రతిభావంతమైన వ్యక్తులంతా ఇక్కడ ఉండటానికి, పనిచేయడానికి అవకాశం లభిస్తే అమెరికాకు చాలా లాభం జరుగుతుందని అన్నారు.
న్యూయార్క్: ట్రంప్ తాజా నిర్ణయాలపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లిం శరణార్థులను అడ్డుకునేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ చేసిన సంతకం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అంటేనే వలసదారుల దేశమని, అందుకు గర్వపడాలని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉందని, అందుకోసం దేశానికి ప్రమాదం కలిగించే వారిపై దృష్టి పెట్టాలని అన్నారు.
శరణార్థుల కోసం, సహాయం కోసం వస్తున్నవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలని సూచించారు. అదే సమయంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ఒకప్పుడు మనం కూడా శరణార్థుల్లాగే ఇక్కడికొచ్చామన్నారు జుకర్ బర్గ్. కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే శరణార్థులను తిప్పి పంపించి ఉంటే ఈరోజు ప్రిసిల్లా కుటుంబం ఇక్కడ ఉండేది కాదన్నారు.
ఫేస్ బుక్ లోని తన పేజీలో ఈ అభిప్రాయాలను జుకర్ వ్యక్తపరిచారు. 'జుకర్బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ చైనా, వియత్నాంల నుంచి అమెరికాకు వచ్చిన శరణార్థుల కుటుంబానికి చెందిన వారు. తన తాత ముత్తాతలు కూడా జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్ల నుంచి వచ్చినవారే' అని జుకర్ పేర్కొన్నారు.
ప్రిసిల్లా విషయం నా వ్యక్తిగతమని చెప్పుకొచ్చిన జుకర్.. ఒక సంఘటనను ఉదహరించాడు. 'నేను కొన్నేళ్ల క్రితం స్థానిక మిడిల్ స్కూల్లో క్లాస్ తీసుకున్నప్పుడు చాలామంది నా బెస్ట్ స్టూడెంట్స్ వలసదారులు' అని జుకర్ అన్నారు. వాళ్లు మన దేశ భవిష్యత్తేనని చెప్పారు.
అమెరికాది వలసదారుల దేశమని, ప్రపంచంలోని ఉన్నతమైన, ప్రతిభావంతమైన వ్యక్తులంతా ఇక్కడ ఉండటానికి, పనిచేయడానికి అవకాశం లభిస్తే అమెరికాకు చాలా లాభం జరుగుతుందని అన్నారు. ప్రజలందరిని ఏకం చేసి ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడం కోసం అవసరమైన ధైర్యం సహానుభూతి ప్రతీ ఒక్కరిలో కలగాలని తాను ఆశిస్తున్నట్టు జుకర్ స్పష్టం చేశారు.