సారీ, మరో అవకాశమివ్వండి: మార్క్ జుకర్బర్గ్, 87 లక్షలమంది యూజర్ల సమాచారం షేర్
వాషింగ్టన్: తనకు మరో అవకాశమివ్వాలని ఫేస్బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్ కోరారు. ఫేస్బుక్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ దీనిని నడిపించడానికి తానే సరైన వ్యక్తిని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ యూజర్స్ సమాచారం దుర్వినియోగం నేపథ్యంలో జుకర్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
లండన్కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టింగ్ సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా ఉపయోగించుకోవడంపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై జుకర్బర్గ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన జుకర్బర్గ్ మరోసారి క్షమించని అడిగారు.
87 మిలియన్ యూజర్ల సమాచారం షేర్
లండన్కు చెందిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్స్ అనలిటికాకు ఫేస్బుక్ నుంచి దాదాపు 87 మిలియన్ల యూజర్ల సమాచారం షేర్ అయ్యిందని బుధవారం విలేకరుల సమావేశంలో ఫేస్బుక్ వెల్లడించింది. ఈ వినియోగదారుల్లో ఎక్కువ మంది అమెరికాకు చెందిన వారే ఉన్నారు.
అమెరికన్లు ఎక్కువ, భారతీయుల సంఖ్య 5 లక్షలకు పైగా
వీరిలో 70.8మిలియన్ల మంది అమెరికన్లు ఉండగా, ఇండోనేషియా, బ్రిటన్లకు చెందిన వారు 1.1 మిలియన్ యూజర్లు ఉన్నారు. భారత్కు చెందిన వారు ఐదు లక్షలకు పైగా యూజర్ల డేటా దుర్వినియోగం అయినట్లు తెలిపారు.
సమాచార భద్రత కోసం ఉద్యోగులు
ఈ సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. పలు దేశాల్లో జరుగుతున్న ఎన్నికలే ఈ ఏడాది ఫేస్బుక్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇతర టెక్నాలజీ టూల్స్ను ఉపయోగిస్తున్నామన్నారు. వేలాది మంది ఉద్యోగులు వినియోగదారుల సమాచార భద్రత కోసం పని చేస్తున్నారని తెలిపారు.
అక్రమాలు జరగకుండా కృషి
భారత్ సహా పలు దేశాల్లో జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. తమ వెబ్ సైట్ సెక్యూరిటీ ఫీచర్లను మరింత పెంచుతున్నామన్నారు. కేంబ్రిడ్జ్ అనలటికా కంపెనీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసిందని, ఇందుకు ఫేస్ బుక్ నుంచి యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.