ఈ రింగులో మీ ఫింగరు ఉంటే చాలు... చెల్లింపు ఇక బేఫికర్!
అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న 'కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో 'టాప్పీ' అనే ఉంగరాన్ని ఆవిష్కరించారు. వైర్ లెస్ పేమెంట్ చిప్ లను కలిగి ఉండే ఈ ఉంగరంతో చెల్లింపులు జరపవచ్చు.
లాస్ వేగాస్: ఉంగరాలను ధరించడం ఒక ఫ్యాషన్. ప్రేమానుబంధాలకు చిరకాల గుర్తులుగా రింగులు మార్చుకుంటూ ఉంటారు. మరి అందరూ ఇష్టపడే అలాంటి రింగులతోనే చెల్లింపులు చేయగలిగితే?
హాంగ్ కాంగ్ కు చెందిన టాప్పీ అనే సంస్థ అలాంటి స్మార్ట్ రింగునే అభివృద్ధి చేసింది. ఆ రింగు చేతి వెలికి ఉంటే చాలు.. డెబిట్, క్రెడిట్ కార్డులతో పనుండదు. దాంతోనే సులువుగా నగదు రహిత చెల్లింపు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఉంగరం పేరు కూడా.. 'టాప్పీ'యే.
అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న 'కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో ఈ ఉంగరాన్ని ఆవిష్కరించారు. వైర్ లెస్ పేమెంట్ చిప్ లను కలిగి ఉండే ఈ రింగ్ స్మార్ట్ ఫోన్ యాప్ తో అనుసంధానమై పనిచేస్తుంది.
సదరు యాప్ నుంచి బ్యాకు ఖాతాలకు అనుసంధానం చేసుకునే వీలుంటుంది. దీంతో ఏ స్టోర్ లోనైనా పేమెంట్ మిషన్ దగ్గర ఈ రింగును చూపించి సులువుగా చెల్లింపులు చేయవచ్చు. పైగా ఈ రింగ్ ను చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకపోవడం విశేషం.
ఈ రింగ్ కు సంబంధించిన సాంకేతికతను జ్యుయలరీ కంపెనీలకు అందించనున్నట్లు దీనిని రూపొందించిన టాప్పీ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ లియాంగ్ పేర్కొన్నారు. వెండి, బంగారం.. రెండింటితోనూ ఈ స్మార్ట్ రింగ్ లను తయారు చేయవచ్చని వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో అమెరికా మార్కెట్ లోకి రానున్న ఈ 'టాప్పీ' రింగ్ ధర వంద డాలర్లు అంటే.. మన రూపాయల్లో సుమారు 6,800 వరకు ఉంటుందట.