ఫేస్బుక్: భారత ప్రియుడి కోసం వస్తూ బ్రిటన్ మహిళ మృతి
న్యూఢిల్లీ/లండన్: భారతదేశంలోని తన ప్రియుడ్ని కలిసేందుకు వస్తూ ఓ బ్రిటన్ మహిళ మృతి చెందింది. కాగా, ఆమెకు అప్పటికే వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోని పంజాబ్ రాష్ట్రంలోని తన ప్రియుడ్ని కలిసేందుకు ఆమె భారతదేశం వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్లోని ఛేషైర్లో నివాసముంటున్న ఏంజిలా స్లిన్(45)కు భారతదేశంలోని లూథియానా వాసి జస్పాల్ సింగ్(30)కి ఫేస్బుక్ ద్వారా 2014లో పరిచయమైంది. వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మే 4న ప్రియుడు జస్పాల్ సింగ్ను కలిసేందుకు ఏంజిలా స్లిన్ భారతదేశంలో అడుగుపెట్టింది. నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఆమె.. తన భర్తకు తెలియకుండానే భారతదేశం వచ్చేసింది. ఆమెకు స్టీఫెన్(48) అనే భర్త, 15 నుంచి 24ఏళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా, మే 4న భారతదేశంలో అడుపెట్టిన ఆమెకు నిమోనియో రావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆమె గత ఆదివారం మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తన ప్రియురాలు మరణించిందంటే నమ్మలేనని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్న స్లిన్.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురై మృతి చెందడం తమను దిగ్ర్భాంతికి గురి చేసిందని స్లిన్ అత్త డోరీన్ స్లిన్ అన్నారు. తన ప్రియుడ్ని కలిసేందుకు వెళ్లిన ఆమె కథ విషాదాంతం కావడం తమనెంతో కలచివేసిందని తెలిపారు.