పుల్వామా అటాక్: అందుకు ప్రతీకారంగా... పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుంచి అజహర్ ఆదేశాలు
కరాచీ/న్యూఢిల్లీ: జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ రావల్పిండిలోని ఆర్మీ బేస్ ఆసుపత్రిలో గత నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్నాడు. ఇటీవల పుల్వామా ఉగ్రవాద దాడికి ఆయన అక్కడి నుంచే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైష్ ఎ మహ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అక్కడి నుంచే మసూద్ అజహర్ సూచనలు
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి పాల్పడాలని మసూద్ అజహర్ తమ సభ్యులకు అక్కడి నుంచే సూచనలు చేశాడు. ఇతను పఠాన్కోట్ ఉగ్రదాడి ప్రధాన సూత్రదారుడు కూడా. గత నాలుగు నెలలుగా అనారోగ్య కారణాలతో అక్కడే చికిత్స పొందుతున్నాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ (యూజేసీ) నిర్వహించిన గత ఆరు కీలక సమావేశాలకు అతను హాజరు కాలేదు. దీంతోనే అతను అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తేలింది.
మేనల్లుడిని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా..
భారత్కు వ్యతిరేకంగా దాడులు నిర్వహించే జిహాదీ గ్రూప్ల కౌన్సిల్ యూజీసీ. పుల్వామా దాడికి ఎనిమిది రోజుల ముందే తమ సంస్థ సభ్యులకు మసూద్ ఓ ఆడియో సందేశాన్ని పంపించాడని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్లో తన మేనల్లుడు ఉస్మాన్ను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ఈ ఆడియోలో మసూద్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ యుద్ధంలో మరణించడం కంటే గొప్ప విషయం ఉండదని కూడా పేర్కొన్నాడట.
శిక్షణ ఇచ్చింది అతడే
మరో విషయం ఏమంటే, దాడికి సంబంధించిన ప్లాన్ను అజహర్ యూజేసీలో ఉన్న జిహాదీ గ్రూపులతో పంచుకోలేదని తెలుస్తోంది. ఈ ఆడియోల టేపులను ఉపయోగించి కాశ్మీర్ లోయలో ఆత్మాహుతి దాడులు చేసే విధంగా యువతను ప్రేరేపించాలని తన మరో మేనల్లుడు మహమ్మద్ ఉమర్, జైషే మాజీ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీలకు రహస్య సందేశాలు పంపించాడని సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దర్కు.. రషీద్ ఘాజీ శిక్షణ ఇచ్చాడని తెలుస్తోంది.