మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఉగ్రవాది ముద్ర: మరో ముగ్గురికీ అదే గుర్తింపు
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై ఉగ్రవాద ముద్ర పడింది. ముంబై చీకటి సామ్రాజ్యాధిపతిగా ఉంటూ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన అసలు సూత్రధారి దావూద్ ఇబ్రహీంను కరడుగట్టిన ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరుకు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అతనితో పాటు పాకిస్తాన్ కేంద్రంగా భారత్ పై తరచూ ఆత్మాహూతి దాడులకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, మరో టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జకీర్ వుర్ రెహ్మాన్ లఖ్వీలను కూడా ఉగ్రవాదులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. జకీర్ వుర్ రెహ్మాన్ లఖ్వీ.. పాకిస్తానీయుడేనని వెల్లడించింది.
నాడు మాఫియా డాన్..నేడు టెర్రరిస్ట్
అవాంఛనీయ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఈ నలుగురినీ ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మసూద్ అజర్ గానీ, హఫీజ్ మహమ్మద్ సయీద్ గానీ ఉగ్రవాదులుగా దేశ ప్రజలకు తెలుసు. అదే జాబితాలో దావూద్ ఇబ్రహీంను చేర్చడం ఇదే తొలిసారి. ముంబైని వణికించిన మాఫియా డాన్ గా మాత్రమే దావూద్ ఇబ్రహీం మనకు తెలుసు. 1993లో 200 మందికి పైగా ముంబైవాసులను పొట్టనబెట్టుకున్న భయానక ఉగ్రదాడికి అసలు సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ముంబై దాడుల అనంతరం అతణ్ని అరెస్టు చేయడానికి కేంద్రం ప్రయత్నించింది. భద్రతా బలగాల కన్నుగప్పి దేశం విడిచి పారిపోయాడు దావూద్. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లో నివసిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా బహిర్గతం చేసింది. దావూద్ ను తమకు అప్పగించాలంటూ పలుమార్లు పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషె మహమ్మద్..
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఆత్మాహూతి దాడి చోటు చేసుకున్న ఘటనకు మాస్టర్ మైండ్ మౌలానా మసూద్ అజర్. ఆ దాడి ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. 2001లో పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు అసలు సూత్రధారి హఫీజ్ మహమ్మద్ సయీద్. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో బాంబుదాడి ఘటనకూ సూత్రధారి అతనే. భారత్ పై పలుమార్లు ప్రాణాంతక దాడులకు పాల్పడిన జకీర్ వుర్ రెహ్మాన్ లఖ్వీ సైతం పాకిస్తానీయుడేనని కేంద్ర హోం మంత్రిత్వశాఖ గుర్తించింది. లఖ్వీ.. లష్కరే తొయిబా చీఫ్ కమాండర్ గా పనిచేస్తున్నాడు.
ఉగ్ర మూకను ముంబైపైకి ఉసిగొల్పిన హఫీజ్..
హఫీజ్ సయీద్.. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. 2008లో మరోసారి ముంబైపై పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు దాడి చేయడానికి హఫీజ్ సయీద్ కుట్ర పన్నినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ అతణ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది. పుణేలోని ఎరవాడ కారాగారాంలో ఉరికంబం ఎక్కిన కసబ్.. ఈ గ్యాంగ్ సభ్యుడే. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను ముంబైపై దాడికి ఉసి గొల్పినది హఫీజ్ సయీదేనని కసబ్ సైతం వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, లష్కరే తొయిబా, జమాత్ వుద్ దవా ఉగ్రవాద సంస్థలకు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు నిషేధించాయి. మరిన్ని దేశాలు ఆయా సంస్థల వ్యక్తులు, కార్యకలాపాలను నిషేధించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.