మసూద్అజార్ సమస్యకు త్వరలోనే పరిష్కారం: చైనా
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంపై సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆయన్ను వెనకేసుకొస్తున్న చైనాకు అమెరికా, యూకే, ఫ్రాన్స్లు అల్టిమేటం జారీ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డ్రాగన్ కంట్రీ పేర్కొంది. అయితే గత కొన్ని నెలలుగా మసూద్ అజార్ సమస్య తీవ్రతరం అవుతోందని చెప్పిన చైనా... పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయని వెల్లడించింది.
ఫిబ్రవరి 14న భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాది అదిల్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాంటూ ఫ్రాన్స్, అమెరికా, యూకేలు 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ ముందు ప్రతిపాదన ఉంచాయి.అయితే చైనా ఇందుకు ఒప్పుకోలేదు. అయితే చైనా తన తీరును మార్చుకునేందుకు ఏప్రిల్ 23న డెడ్లైన్ విధిస్తూ అమెరికా ఫ్రాన్స్ యూకే దేశాలు అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి లూకాంగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి, 1267 ఆంక్షల కమిటీలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.
వస్తున్న వార్తలపై స్పష్టమైన ఆధారాలు ఉండాలని చెప్పిన లూకాంగ్... మసూద్ అజార్పై చైనా స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. ఈ సమస్య కేవలం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని అన్నారు. శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం రానిదే సమస్యకు పరిష్కారం జరగదని చెప్పారు. అంతవరకు ఎలాంటి వార్తలను నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. ఇక మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చడంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అంతేకాదు ఈ అంశంపై పలుదేశాలతో చర్చిస్తున్నామని కూడా చైనా పేర్కొంది. పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని లూకాంగ్ తెలిపారు. కొన్ని దేశాలు అజార్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ ఐక్యారాజ్య సమితి భద్రతామండలి పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని చెప్పిన లూకాంగ్.. ఆ చర్యను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.