మసూద్ అజార్ అదృశ్యం కాలేదు... పాక్ ఆర్మీ దాచింది: ఇంటెలిజెన్స్ వర్గాలు
కరాచీ: జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కనిపించడం లేదంటూ పాకిస్తాన్ కొత్త నాటకానికి తెరతీసింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చే విషయంపై కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో పాక్ కొత్త డ్రామాకు తెరదీసింది. అయితే పాకిస్తాన్ చెప్పింది అబద్ధమని చెబుతూ మసూద్ అజార్ను పాక్ ఆర్మీ మరియు ఐఎస్ఐలు భద్రంగా ఒక చోట దాచాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కుండ బద్దలు కొట్టాయి.
ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక ప్రకారం మసూద్ అజార్ ఎక్కడికి పారిపోలేదని పాక్ ఆర్మీ మసూద్ను అతని కుటుంబ సభ్యులను భద్రంగా ఓ ఇంట్లో దాచి ఉంచిందని సమాచారం. బాహవల్పూర్లోని ఓ ఇంట్లో వారిని ఉంచినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు జైషే మొహ్మద్ కొత్త ప్రధాన కార్యాలయం అయిన మర్కాజ్ ఉస్మాన్ ఓ అలీలో వారు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
అంతేకాదు వీరికి భద్రతను కూడా కల్పిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. మసూద్ అజార్ తరుచూ తన ఇళ్లను మార్చుతూ ఉండేవాడని అదికూడా బాహవల్పూర్-పఖ్తుంక్వా ప్రాంతాల్లోనే మార్చేవాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్ను వీడి ఎటో వెళ్లిపోయాడంటూ సోమవారం పాక్ ఆర్థికశాఖ మంత్రి హమ్మద్ అజార్ ఒక ప్రకటన చేశారు. మసూద్ అజార్ అదృశ్యమైనందున అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కుదరదని హమ్మద్ అజార్ తెలిపారు. ఉగ్రవాదంకు నిధులు సమకూరుస్తున్న సంస్థలపై నిఘా వేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ మరికొద్దిరోజుల్లో ఉందనగా పాక్ కొత్త డ్రామాకు తెరదీయడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Recommended Video
అంతేకాదు ఉగ్రవాదంకు నిధులు సమకూరుస్తున్న సంస్థలపై పాకిస్తాన్ చర్యలు తీసుకుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ మధ్యనే లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు పాక్ కోర్టు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది.