మొగదిషులో భారీ పేలుడు: 70 మందికిపైగా మృతి, 50మందికి తీవ్రగాయాలు
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో 70 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పన్ను వసూలు కేంద్రమే లక్ష్యం చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం రద్దీగా ఉన్న సమయంలోనే పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.
కానీ, సోమాలియాలో గత కొంత కాలంగా ఆల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అయిన అల్ షబాబ్ తరచూ ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు, పేలుళ్లకు పాల్పడుతోంది. రద్దీగా ఉండే చెక్ పాయింట్లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గతంలో దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
2017లో జరిగిన ట్రక్కు బాంబు పేలుడు ఘటనలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దాడికి అల్ షబాబే కారణమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తాజా పేలుడు ఘటనలో యూనివర్సిటీ విద్యార్థులు, పోలీసు అధికారులు, ఇద్దరు టర్కీష్ పౌరులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.