ట్రంప్ గురించి ఆర్జీవీ చెప్పిందే నిజమైంది.. ఒప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్.. మరో సంచలన ప్రకటన..
''భారీ జన సమూహాలంటే డొనాల్డ్ ట్రంప్కు అబ్సెషన్. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని భారత ప్రధాని మోదీ గేమ్ ఆడారు. కోటి మందిని రప్పిస్తానని ఊరించి ట్రంప్ ను అహ్మదాబాద్ రప్పించారు'' అంటూ ట్రంప్ భారత పర్యటన సందర్భంలో దర్శకుడు ఆర్జీవీ సెటైర్లు సంధించారు. విచిత్రంగా ట్రంప్ కూడా ఆ విషయాన్ని దాదాపుగా అంగీకరించారు. తన సభకు భారీ సంఖ్యలో జనం రావడాన్ని చాలా ఇష్టపడతానని స్వయంగా ఒప్పుకున్నారు. దీంతోపాటు తాలిబన్లతో శాంతి చర్చలపైనా సంచలన ప్రకటన చేశారు.
ఫుల్ సక్సెస్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ శనివారం సౌత్ కరోలినా స్టేట్ లో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో మురిసిపోయిన ఆయన.. భారత పర్యటన విశేషాలను గుర్తు చేశారు. ఇండియా టూర్ ఆద్యంతం సక్సెస్ ఫుల్ గా సాగిందని, ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకుడని ట్రంప్ చెప్పారు. అహ్మదాబాద్ సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చిన విషయాన్ని ట్రంప్ పదే పదే ప్రస్తావించారు. ఆ క్రమంలోనే మనసులో మాటను బయటపెట్టేశారు..
ఇకపై బాధ లేదు..
‘‘సాధారణంగా జనసందోహాన్ని నేను చాలా ఇష్టపడతాను. జనం కూడా నన్ను బాగా ప్రేమిస్తారు. అందుకే నా సభలకు భారీ సంఖ్యలో జనం వస్తుంటారు. ఇండియాలో కూడా అదే జరిగింది. అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్' సభకు లక్షలమంది వచ్చారు. ఇండియాలో 130 కోట్ల జనాభా ఉంటే, అమెరికాలో 35 కోట్ల మంది ఉన్నారు. ఇండియాను చూసొచ్చిన తర్వాత.. మనదగ్గర(అమెరికాలో) జనసమూహాన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోను. ఇకపై నా మీటింగ్ లకు జనం రారేమోననే బాధ లేనేలేదు''అని ట్రంప్ అన్నారు.
తాలిబన్లను నేరుగా కలుస్తా..
ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరడంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం ద్వారా 18 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి తెరపడే మార్గం సుగమమైందన్నారు. దీనిపై వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అతిత్వరలోనే తాలిబన్ నేతలను నేరుగా కలుస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్ లో శాంతి స్థాపనకు తాలిబన్లు సహకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
ముందుంది మెసళ్ల పండుగ..
తాలిబన్లతో శాంతి ఒప్పందం చేసుకున్న మాత్రాన అమెరికా గట్టెక్కినట్లు కాదని, తర్వాతి అంకంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో జరగబోయే చర్యలు చాలా క్లిష్టమైనవనే వాదన వినిపిస్తోంది. అయితే ట్రంప్ మాత్రం అఫ్గాన్ సర్కరుతో చర్చలు కూడా ఫలిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల అందరూ విసిగిపోయి ఉన్నారు కాబట్టి తాలిబన్లు ఒప్పుకున్నట్లే అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఒప్పందాలపై సంతకాలు చేస్తుందని ఆయన చెప్పారు.
ఇంతకీ ఏంటా ఒప్పందం?
అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఒప్పందం ప్రకారం.. విడతల వారీగా అమెరికా తన సేనల్ని అఫ్గాన్ నుంచి విరమించుకుంటుంది. డీల్ కుదిని 135 రోజుల్లోపు.. అంటే జూన్ రెండోవారం నాటికి అమెరికా సేనల సంఖ్యను 13 వేల నుంచి 8,600కు తగ్గించుకుంటుంది. ఆ తర్వాత మరో 14 నెలల్లో.. అంటే 2021 ఆగస్టు నాటికి మొత్తం సేనలను ఉపసంహరించుకుంటుంది. తద్వారా 18 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి చరమగీతం పాడినట్లవుతుందని ట్రంప్ తెలిపారు.