బ్రిటన్ రాజకీయాలు: అవిశ్వాస పరీక్షలో స్వల్ప తేడాతో నెగ్గిన థెరిసా మే ప్రభుత్వం
లండన్ : బ్రిటన్లో థెరిసా మే ప్రభుత్వం అతి కష్టం మీద గట్టెక్కింది. బ్రెగ్జిట్పై జరిగిన ఓటింగ్లో థెరిసా మేకు షాకిచ్చిన సొంత ఎంపీలు... అవిశ్వాస పరీక్షలో మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. 19 ఓట్ల స్వల్ప తేడాతో థెరిసా నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ గట్టెక్కింది. ప్రభుత్వం పై అవిశ్వాస పరీక్ష తీర్మానంను ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించడం జరిగింది.
ఇదిలా ఉంటే థెరిసా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదని ముందే ఊహించారు. కన్జర్వేటివ్ పార్టీ మిత్ర పక్షాలుగా ఉన్న డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ నార్తర్న్ ఐర్లాండ్ ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని ముందే హామీ ఇవ్వడంతో చర్చ సందర్భంగా థెరిసా మే ప్రశాంతంగా కనిపించారు. ఇక ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంకు అనుకూలంగా 306 మంది సభ్యులు ఓటు వేయగా... వ్యతిరేకంగా 325 మంది ఎంపీలు ఓటు వేశారు. దీంతో థెరిసా ప్రభుత్వం నెగ్గింది. ఇక ఓటింగ్ అనంతరం థెరిసా మే మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులపై ప్రతిపక్షాలతో మాట్లాడుతానని అందరిని కలుపుకుని వెళతానని చెప్పారు.
అంతకుముందు బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడంపై కన్జర్వేటివ్ పార్టీలోని సొంత ఎంపీలే వ్యతిరేకించడంతో ఓటింగ్ అనివార్యమైంది. ఇందులో థెరిసాకు షాకిచ్చారు సొంత ఎంపీలు. 230 ఓట్ల తేడాతో థెరిసా ప్రభుత్వం ఓటమి చూసింది. ఆధునిక బ్రిటన్ చరిత్రలో ఒక ప్రభుత్వంపై ఇంత పెద్ద వ్యత్యాసంతో ఓటమి చూడటం ఇదే తొలిసారి కావడం విశేషం. 1924లో రామ్సే మెక్ డొనాల్డ్ ప్రభుత్వం 166 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఇంతకంటే భారీగా థెరిసా మే ప్రభుత్వం ఓడిపోయిందని ఇందుకు బాధ్యత వహిస్తే ఎవరైనా సరే రాజీనామా చేస్తారని ప్రతిపక్ష నేత కార్బిన్ చెప్పారు.