దేవయాని అరెస్ట్ ఇష్యూ: 'అమెరికాకు ముందే తెలుసు'
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత దౌత్యకారిణి దేవయానికి ఐక్యరాజ్య సమితి(ఐరాస) స్థాయిలో దౌత్య రక్షణ ఉన్నట్లుగా అమెరికాకు ముందే తెలుసునని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటోంది. వీసా ఫ్రాడ్ కేసులో దేవయానిని డిసెంబర్ 12వ తేదీన అమెరికా పోలీసులు అవమానకర రీతిలో అరెస్టు చేయడమే కాకుండా, ఆమె దుస్తులు విప్పించి తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇది దుమారం రేపింది.
దేవయానికి ఆగస్టు నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఐరాస దౌత్య రక్షణ ఉంది. దీంతో డిసెంబర్ 12వ తేదీన దేవయానిని అరెస్టు చేసిన సమయంలో ఆమెకు వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం నుండి మినహాయింపును కల్పిస్తూ అప్పటికే పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ ఉంది. ఈ విషయం అమెరికాకు తెలుసునని విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది.
మరోవైపు దేవయానిపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేది లేదని పేరు వెల్లడించని అమెరికా అధికారులు స్పష్టం చేయడాన్ని ఏమాత్రం ఖాతరు చేయని భారత ప్రభుత్వం, దేశంలోని అమెరికా దౌత్య అధికారులెవరైనా తమకున్న విశేషాధికారాలను దుర్వినియోగం చేస్తే వదిలేది లేదని, తీవ్ర చర్యలు తీసుకుంటామని మంగళవారం స్పష్టం చేసింది.
వీసా మోసం ఆరోపణలపై దేవయానిపై పెట్టిన కేసులో ముందుకెళ్తున్నట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ నుంచి వచ్చిన వార్తలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కొట్టివేస్తూ, ఈ విషయంపై అధికారికంగా ఏదైనా చెప్పాల్సింది అమెరికా విదేశాంగ శాఖ మాత్రమేనని, ఆ శాఖ నుంచి వచ్చే ప్రకటనపై మాత్రమే తాము స్పందిస్తామని చెప్పారు. అరెస్టు సంఘటన మొత్తం అంశాన్ని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసిందని ఆయన చెప్తూ, దీనిపై అధికారిక స్పందన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ, మంత్రిత్వ శాఖ ప్రకటనల్లో విచారం వ్యక్తమవుతోందని కూడా ఆయన చెప్పారు.
కాగా, తమ దౌత్య కార్యాలయాల్లో, తమ గృహాల్లోని భారతీయ ఉద్యోగుల వివరాలను అమెరికా రాయబార కార్యాలయం సమర్పించే విషయంలో ఆలస్యం గురించి అడగ్గా, సెలవుల కారణంగా వివరాలు సమర్పించడానికి అమెరికా ఎంబసీ కొంత అదనపు సమయం కోరిందన్నారు. ఈ వివరాల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.