సొంత ఖర్చుల కోసం వెయిటర్గా గవర్నర్ సతీమణి!
న్యూయార్క్: ఆమె ఓ రాష్ట్రానికి గవర్నర్ సతీమణి. మన దేశంలో అయితే గవర్నర్ సతీమణి కాబట్టి రాష్ట్ర ప్రథమ మహిళగా రాష్ట్ర ప్రజలు, అధికారులచే గౌరవ మర్యాదలు అందుకుంటారు. పెద్దగా వారికి మరో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ, అమెరికాలో మాత్రం ఓ గవర్నర్ సతీమణి తన కుటుంబం కోసం ఓ హోటల్ లో వెయిటర్గా చేరిపోయారు.
ఎందుకంటే తన కుటుంబానికి ఖర్చలు ఎక్కువయ్యాయని, వాటిని తీర్చుకునేందుకు ఏదో ఒక పని చేయకతప్పదని ఎంతో గౌరవంగా చెబుతోంది. గవర్నర్ సతీమణి అంటే మనదేశంలోనైతే ప్రత్యేక గౌరవ మర్యాదలుంటాయి. కానీ, అక్కడ ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సాధారణ పౌరులులాగే జీవించడం మంచి విషయం.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మైనె రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ దేశంలోనే అత్యల్ప జీతం తీసుకునే గవర్నర్. ఆయన భార్య అన్ లెపేజ్ రాష్ట్రానికి ప్రథమ మహిళగా గుర్తింపు, రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నా తన భర్త తెచ్చిన జీతంతోనే తనకు కావాల్సినవి కొనుక్కుంటారు.
ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న ఆదర్శ భావాలున్న వ్యక్తి కావడంతో ఆమె వెయిటర్గా విధులు నిర్వహించేందుకు సైతం పెద్ద తేడా చూపలేదు. అయితే ఇటీవల అన్ లెపేజ్కు వ్యక్తిగత అవసరాలకు ఒక కారు కొనాలన్న కోరిక పుట్టిందట.
తన భర్త.. గవర్నర్ జీతం కారు కొనేందుకు ఏ మాత్రం సరిపోకపోవడంతో ఆమె కూడా కొంత డబ్బు జమ చేసేందుకు ఉద్యోగం చేయాలనుకుంది. వెంటనే స్థానిక హోటల్లో వెయిటర్గా ఉద్యోగంలో చేరింది.
రాష్ట్రానికి ప్రథమ మహిళ అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలా ఉద్యోగం చేస్తుండటంతో అక్కడికి వచ్చిన వారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, తాను కారు కొనడానికి కావాల్సిన డబ్బుల కోసం మాత్రమే తాత్కలికంగా ఉద్యోగం చేస్తున్నాని, ఆ తర్వాత అవసరమైతే మళ్లీ ఉద్యోగ బాట పడతానని అన్ లెపేజ్ స్పష్టం చేశారు.