జపాన్కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలు
జపాన్ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. 2011లో సునామీ జపాన్ దేశాన్ని తుడిచివేసింది. ఎంతో ఆర్థికంగా ప్రపంచ అగ్రదేశాలతో పోటీపడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ సునామీ ఆ దేశాన్ని దేశం కన్న కలలకు కళ్లెం వేసింది. తాజాగా ఇలాంటి ముప్పు జపాన్కు మళ్లీ పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. స్వయంగా జపాన్ ప్రభుత్వమే ప్రకటించడంతో ఈ దేశం మళ్లీ వణుకుతోంది.
రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 9గా నమోదు అయ్యే ఛాన్స్
ఓ వైపు కరోనావైరస్ విలయతాండవం... మరోవైపు సునామీ హెచ్చరికలతో జపాన్ ప్రజలు వణికిపోతున్నారు. 2011 కంటే ప్రమాదకరమైన సునామీ జపాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందనే హెచ్చరికలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సునామీతో పాటు భారీ భూకంపం కూడా సంభవించే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. జపాన్ ట్రెంచ్, మరియు కురిల్ ట్రెంచ్ల కేంద్రంగా భూమి కంపించే అవకాశం ఉందని జపాన్ నిపుణులు చెబుతున్నారు. ఇక సునామీ వస్తే రాకాసి అలలు 30 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడతాయని హెచ్చరిస్తున్నారు. ఇక భూకంపం సంభవిస్తే రిక్టర్ స్కేల్పై 9గా నమోదవుతుందని ఇది అత్యంత ప్రమాదకరంగా సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రం కేంద్రంగా ...
ఏప్రిల్ 18వ తేదీన టోక్యోకు దక్షిణాన ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన భూకంపం జపాన్ గొలుసు ద్వీపాలను కుదిపేసింది. పసిఫిక్ మహాసముద్రంకు పశ్చిమాన ఉన్న ఒగసవారా ద్వీపంలో భూమి కంపించినందున పెద్దగా విధ్వంసం జరగలేదు. ఇది టోక్యోకు 620 మైళ్ల దూరంలో సంభవించిందని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. జపాన్ ట్రెంచ్ భూకంపాలకు, సునామీలకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది. 2011 మార్చి 11న సంభవించిన సునామీకి కూడా కేంద్రం ఈ జపాన్ ట్రెంచ్ కావడం విశేషం. ఈ సునామీ నాడు 15వేల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ తరహా సునామీ మళ్లీ వస్తే ప్రాణాలు కాపాడటం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.
Recommended Video
అణువిద్యుత్ కేంద్రం పరిస్థితి ఏంటి..?
ఇక భూకంపాలు, సునామీలపై ఏర్పాటు చేసిన ప్యానెల్ చిషిమా ట్రెంచ్ కేంద్రంగా భూమి కంపిస్తుందని దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 9.3గా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు తూర్పు హొక్కైడోను 6 నుంచి 7 తీవ్రతతో భూమి కుదిపేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఎరిమో పట్టణంలో అలలు 90 అడుగుల ఎత్తుకు ఎగిసిపడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక ఫుకుషిమాలోని అణువిద్యుత్ కేంద్రం మళ్లీ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి పూర్తిగా మునిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఫుకుషిమాలోని అణువిద్యుత్ కేంద్రం 2011లో వచ్చిన సునామీ దెబ్బకు భారీగా ధ్వంసమైంది. ఇక అణువిద్యుత్ కేంద్రాన్ని కాపాడుకునేందుకు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ చర్యలు తీసుకుంటోంది. 11 మీటర్ల ఎత్తులో భారీ గోడ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇది భూకంపాన్ని సునామీలను తట్టుకునేలా నిర్మించేందుకు ఇంజినీర్లు ప్రణాళిక రచిస్తున్నారు.