ఆ మహిళల గురించి మీకు తెలుసా: ఊగిపోయిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ను ఆయన భార్య మిలానియా ట్రంప్ వెనుకేసుకొస్తున్నారు. పలువురు మహిళలతో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. తన భర్త జెంటిల్మెన్ అన్నారు.
ఆరోపణలు చేసిన మహిళలు అబద్దాల కోరులని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లీ బుష్ వ్యవహారంలో కూడా తన భర్త తప్పులేదని చెప్పింది. తన భర్త పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పిదంి. ఆయనో దయగల మనిషి అని చెప్పింది. అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని దెబ్బతీసేందుకు పన్నిన వ్యవస్థీకృత కుట్రగా ఆరోపించారు.
ట్రంప్ పైన ఆరోపణలు చేసిన మహిళల చరిత్ర మీడియాకు తెలుసా అని ప్రశ్నించారు. తన భర్త ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించరని ఆమె పేర్కొన్నారు. ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునే అంశాన్ని ఓ టీవీ హోస్ట్ రచ్చకీడ్చారని ధ్వజమెత్తారు. తన భర్త ట్రంప్ మహిళల్ని గౌరవిస్తారన్నారు. డొనాల్డ్ అభ్యర్థిత్వాన్ని తప్పు పట్టేందుకు హిల్లరీ ప్రచారకర్తలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ట్రంప్ టీవీ నెట్వర్క్ ఏర్పాటుకు యత్నాలు
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓ టీవీనెట్వర్క్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే పని మీద ఆయన అల్లుడు జరీద్ కుష్నర్ లయన్ ట్రీ అడ్వయిజర్ సీఈవో యారీ బొర్కాఫ్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ బయటపెట్టింది.
వీరిద్దరు కొన్ని నెలలుగా తరచూ సమావేశమవుతున్నారు. మీడియాలో పెద్ద డీల్స్ను చేసే వ్యక్తిగా బొర్కాఫ్కు పేరుంది. ప్రస్తుతానికి వీరి చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నెలలో ట్రంప్ వాషింగ్టన్ పోస్టు పత్రికతో మాట్లాడుతూ.. తనకు మీడియా కంపెనీ పెట్టడం ఇష్టంలేదన్నారు. కాగా, కుష్నర్ ట్రంప్ కుమార్తె ఇవాంకను వివాహం చేసుకున్నారు.