‘‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా .. మానసికంగా సిద్ధమయ్యా.. కానీ...’’
దోపిడీ దుండగులు తనను రేప్ చేసి చంపేస్తారని తాను అనుకున్నానని, అందుకు మానసికంగా కూడా సిద్ధమయ్యానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది
పారిస్: పారిస్ దోపిడీ ఘటన తరువాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలు తనను రేప్ చేసి చంపేస్తారని తాను భావించానని చెప్పింది.
గత ఏడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కిమ్ తన సోదరీమణులతో పంచుకుంది.
''అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలోకి బుల్లెట్లు దించుతారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేసి చంపేస్తారనుకున్నా. అందుకు మానసికంగా సిద్ధమయ్యా..'' అని కిమ్ కర్దాషియన్ వెల్లడించింది.
అయితే ఆ దోపిడీ దుండగులు ఆమెకు భౌతికంగా ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆమెను బాత్రూంలో బంధించి, ఆమె ఆభరణాలను మాత్రమే ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.