ట్రంప్ కాదు, కిమ్ కాదు.. ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా #MeToo ఉద్యమ మహిళలు!
వాషింగ్టన్: ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిలిచిన ఈ రేసులో ఆ అవార్డును మూడో వ్యక్తి తన్నుకుపోయాడు.
ఈ ఏడాది ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా #MeToo ఉద్యమాన్ని ప్రారంభించిన మహిళల బృందం నిలిచింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్స్టెయిన్ చేతిలో వేధింపులకు గురైన మహిళలే ఈ బృందంలో ఉన్నారు.
వీరంతా #MeToo ట్యాగ్ ద్వారా ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు తమ లైంగిక వేధింపుల కథలను బయటికి చెప్పారు.
ఎంతో మందిని ప్రభావితం చేసిన ఈ ఉద్యమాన్ని గుర్తిస్తూ 'ద సైలెన్స్ బ్రేకర్స్ (నిశ్శబ్ద ఛేదకులు)' అని ది టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. అలాగే మ్యాగజైన్ ముఖచిత్రం మీద ఈ ఉద్యమాన్ని నడిపిన ఐదుగురు మహిళల ఫొటోలను ప్రచురించింది.
ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించిన #MeToo బృందంలో నటి యాష్లీ జుడ్, ఉబెర్ మాజీ ఇంజినీర్ సూసెన్ ఫౌలర్, అడామా ఇవూ, పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఇసబెల్ పాస్కుల్లు ఉన్నారు.