ఎంహెచ్ 17లో ట్విస్ట్లు: మీరేనని రష్యాపై ఉక్రెయిన్ ఫైర్
కౌలాలంపూర్/కీవ్: విమానాన్ని వాళ్లే కూల్చేశారని, సాక్ష్యాలు చెరిపేస్తున్నారని రష్యా అనుకూల వేర్పాటువాదులపై ఉక్రెయిన్ మండిపడుతోంది. సాక్ష్యాల చెరిపివేతకు రష్యా కూడా సహకరిస్తోందని ఆరోపించింది. విమానం కూలిపోయిన చోటి నుంచి 38 మృతదేహాలను డోనెట్స్క్ నగరానికి తరలించారని, విమాన శకలాలను కూడా రష్యాకు పంపించి వేస్తున్నారని, విమానం కూల్చివేత అంతర్జాతీయ నేరమని, వేర్పాటువాదులు రష్యా మద్దతుతో సాక్ష్యాలను చెరిపివేస్తున్నారని తాము అధికారికంగా చెబుతున్నామని ఉక్రెయిన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సంఘటన స్థలానికి తమ దర్యాప్తు అధికారులు వెళ్లకుండా వేర్పాటువాదులు అడ్డుకుంటున్నారని ఉక్రెయిన్ పేర్కొంది. గురువారం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వస్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్17 క్షిపణి దాడితో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ప్రభుత్వం, అక్కడి వేర్పాటువాదుల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక దేశాలకు చెందిన అమాయక పౌరులు బలైపోయారు.
అంతర్జాతీయ దర్యాప్తు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వీలుగా... విమానం కూలిపోయిన ప్రాంతంలో 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కాల్పుల విరమణ పాటించేందుకు వేర్పాటు వాదులు అంగీకరించారు. అయితే అంతకంటే ముందుగానే సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. విమానం కూల్చివేత ఘటనపై అత్యవసరంగా అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టాలని అమెరికా, మలేషియా, ఉక్రెయిన్, చైనా, ఆసే్ట్రలియా తదితర దేశాలు డిమాండ్ చేశాయి. ఇందుకు రష్యా కూడా సహకరించాలని పేర్కొన్నాయి.
విమానం బ్లాక్బాక్స్లను తాము స్వాధీనం చేసుకున్నట్లు వేర్పాటువాదులే స్వయంగా ప్రకటించారు. వాటిని పరీక్షల నిమిత్తం రష్యాకు తరలిస్తామన్నారు. బ్లాక్బాక్స్లు మాస్కోకు వస్తున్నాయని రష్యా రేడియో స్టేషన్ ఒకటి ప్రకటించింది. అయితే బ్లాక్బాక్స్ల విషయంలో డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ వేర్పాటువాద సంస్థ నేత అలెగ్జాండర్ బొరొడై కొత్తమాట చెప్పారు. సంఘటన స్థలంలో అసలు బ్లాక్బాక్స్లు దొరకలేదని తెలిపారు.
ఎంహెచ్-17 విమానం సొంతదారులుగా బ్లాక్బాక్స్లపై పూర్తి హక్కు మాకే ఉంటుందని, వాటిని తమకే అప్పగించాలని ఉక్రెయిన్ ప్రధాని డిమాండ్ చేశారు. ఎంహెచ్-17 విమాన బాధిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. మలేషియా దర్యాప్తు అధికారులు ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. కానీ ఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ వేర్పాటువాదుల తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ విరుచుకుపడింది. ప్రమాదంలో మరణించిన భీతావహంగా ఉన్న ఓ చిన్నారి మృతదేహాన్ని చూపిస్తూ.. ‘‘ఈ చిన్నారి రక్తం మీ చేతులకు అంటుకుంది. ఆ పాపం మీదే. ఎన్ని తరాలు గడిచినా ఆ మరకను మీరు తుడిచేయలేరు'' అంటూ పుతిన్పై దాడులను ఎక్కుపెట్టింది. ప్రభుత్వ సలహాదారు ఆంటోన్ గెరాశెంకో.. పుతిన్కు ఆ చిన్నారి ఫొటోను మెసేజ్ చేసి ‘చిన్నారి చావుకు కారణం మీరే' అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.