ఎంహెచ్ 17 షాకింగ్: 'రష్యా' మిసైల్తో కూల్చేశారు
కౌలాలంపూర్: గత ఏడాది ఉక్రెయిన్లో కూలిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 17 ప్రమాదం గురించి షాకింగ్ అంశాలు వెల్లడవుతున్నాయి. ఈ విమానం మిసైల్ వల్ల కూలిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఏఎం38 క్షిపణి మలేషియా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టిందని, దీంతో ఆ విమానం పేలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు.
రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటుదారులు ఈ విమానాన్ని కూల్చి వేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్ నియంత్రణలో ప్రాంతంలో నుంచి క్షిపణి ప్రయోగించారని రష్యా చెబుతోంది. క్షిపణితో విమానం పైకి దాడి చేసింది ఎవరనే విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు.
ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య పోరు జరుగుతోంది. కాగా, గతేడాది జూలైలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 298 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా తూర్పు ఉక్రెయిన్లో కూలింది.