ట్రంప్ భార్యతో మిషెల్లీ తేనీటి కబుర్లు : భావోద్వేగానికి లోనవుతూ..
వాషింగ్టన్ : త్వరలో శ్వేత సౌధంలో అడుగుపెట్టబోయే మిలానియాలో కొట్టొచ్చినట్టు సంతోషం.. అదే అధ్యక్ష భవనాన్ని త్వరలో వదిలి వెళ్లాల్సి రావడంతో మిషెల్లీ ఒబామాలో ఒకింత భావోద్వేగం.. గురువారం నాడు మిలానియాకు వైట్ హౌజ్ లో మిషెల్లీ ఇచ్చిన ఆతిథ్యం సందర్బంగా.. ఇద్దరిలోను వ్యక్తమైన భావాలు ఇవి.
అమెరికా ప్రథమ అధ్యక్షురాలు మిషెల్లీ ఒబామా.. త్వరలో శ్వేత సౌధంలో అడుగుపెట్టబోయే.. అమెరికా కొత్త ప్రథమ అధ్యక్షురాలు మిలానియాకు అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. ఆ సందర్బంగా.. మిషెల్లీ తన వైట్ హౌజ్ అనుభవాల గురించి మిలానియాకు వివరించారు. తేనీటి కబుర్లతో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
ఒక్కసారి అధ్యక్ష భవనంలోకి అడుగుపెడితే.. అంతా ఓ మ్యూజియాన్ని తలపించేలా ఉంటుందని, అక్కడి ఎదురయ్యే భావోద్వేగాలను ఎప్పటికీ మరిచిపోలేమని మిలానియాతో చెప్పారు మిషెల్లి. శ్వేత సౌధంలోని ప్రైవేటు భవనంలోను మిలానియాతో కాసేపు ముచ్చటించారు మిషెల్లి. ట్రూమన్ బాల్కనీ వద్ద మిలానియాతో మాట్లాడుతూ.. శ్వేత భవనంలో ఎనిమిదేళ్ల పాటు తన పిల్లలను ఎలా పెంచింది వివరించారు.
అదే సమయంలో.. శ్వేత సౌధాన్ని విడిచి వెళ్తున్నందుకు భావోద్వేగానికి లోనయ్యారు మిషెల్లీ. ఈ విషయాన్ని వైట్ హౌజ్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. చివరగా.. రాబోయే రోజుల్లో మిలానియాకు కూడా ఇలాంటి అనుభూతులే కలుగుతాయని మిషెల్లీ చెప్పినట్టుగా ఆయన పేర్కొన్నారు.