మైక్రోసాఫ్ట్ ఆఫర్ : బగ్స్ కనుగొనండి..రూ.21 లక్షలు ప్రైజ్ మనీ గెలవండి
మీకు సాఫ్ట్వేర్లపై మంచి పట్టుందా..? ఆయా సాఫ్ట్వేర్లలో లోపాలను ఇట్టే గుర్తించగలరా...? అలాంటి వారికోసమే ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టనున్న తన క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్లో తప్పులను లేదా బగ్స్ను పసిగట్టగలిగితే చాలు... రూ. 21 లక్షలు మీరు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది మైక్రోసాఫ్ట్.
మైక్రోసాఫ్ట్ సంస్థ క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ను ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఇది చాలా ఏళ్ల క్రితమే తీసుకురావాలని భావించినప్పటికీ అప్పటికే మొజిల్లా ఫైర్ ఫాక్స్ , గూగుల్ బ్రౌజర్లు సత్తా ముందు క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ నిలవలేకపోయింది. అయితే తాజాగా ఎడ్జ్ బ్రౌజర్ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి అందులో దాగి ఉన్న బగ్స్ను కనిపెట్టాలంటూ ఔత్సాహికులకు ఆఫర్ ప్రకటించింది. ఇలా బగ్స్ కనిపెట్టినవారికి రూ. 21 లక్షలు బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అయితే కనిపెట్టిన బగ్ ఎంత స్థాయిలో ప్రమాదం సృష్టించగలదో అనేదానిపై ప్రైజ్ మనీ రూ. 72200 నుంచి రూ. 21 లక్షల వరకు ఉంటుందని తెలిపింది.
ఇక సాఫ్ట్వేర్లో లోపాలను కనిపెట్టే వారికి పలు విధాలుగా బహుమతులు అందిస్తామని తెలిపింది . సాఫ్ట్వేర్లో ట్యాంపరింగ్కు సంబంధించిన లోపాలను కనుగొంటే వారికి రూ.4 లక్షల 33వేలు ప్రైజ్ మనీ అందించనున్నట్లు తెలిపింది. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, సమాచారం బహిరంగ పర్చడంలాంటివి చేసిన వారికి రూ. 7లక్షల 22వేలు బహుమానం ఇవ్వనుంది. ఇక పూర్తిస్థాయి అంటే రూ.21 లక్షలు మాత్రం మొత్తం బగ్స్ను కనుగొన్న వారికి అందివ్వడం జరుగుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఇక క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్లోని బగ్స్ను కనుగొని ఎమ్ఎస్ఆర్సీ రీసెర్చ్ పోర్టల్లోకి వెళ్లి బగన్ సబ్మిషన్ గైడ్లైన్స్ చదవి అక్కడే పోస్టు చేయాల్సి ఉంటుంది.