మాట్లాడే కంప్యూటర్లు వస్తాయి, మంచికోసమే: నాదెళ్ల
శాన్ఫ్రాన్సిస్కో: భవిష్యత్తులో మానవుల భాషను అర్థం చేసుకుని, సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ చెప్పారు. ఇందుకోసం సాంకేతిక నిపుణులు అధునాతన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మానవత్వం పరిమళించేలా గౌరవప్రద సాంకేతికతను కంపెనీలు అభివృద్ధి చేయాలని, చెడు మాత్రం చేయవద్దని సూచించారు.
'శక్తిమంతమైన మానవ భాషను కంప్యూటింగ్ ఆధారిత పరికరాలన్నింటికీ అనుసంధానించాలనే యోచన ఉంది. ఆయా పరికరాలతో కార్యకలాపాలు నిర్వహించేందుకు, పరస్పరం సంభాషించేందుకు కూడా ఉపయోగపడాలి' అని సత్య నాదెళ్ల ఆకాంక్షించారు. ఏటా మైక్రోసాఫ్ట్ నిర్వహించే బిల్డ్ 2016 సమావేశానికి హాజరైన వేలమంది సాంకేతిక నిపుణుల నుద్దేశించి, సత్య నాదెళ్ల కీలక ప్రసంగం చేశారు.
'సంభాషించే కంప్యూటర్లు సాకారం కావాలంటే, వాటిల్లోకి తెలివితేటలను (ఇంటెలిజెన్స్) మీరు నిక్షిప్తం చేయాలి. యంత్రాలు నేర్చుకునేందుకు అనువైన కృత్రిమ మేథస్సుకు సంబంధించి అధునాతన సాంకేతికతలను రూపొందించాలి. అప్పుడే మానవుల భాషను అర్థం చేసుకునేలా కంప్యూటర్లను తయారు చేయడం వీలవుతుంది. సంభాషణలను కూడా అవగాహన చేసుకునేలా రూపొందుతాయి. వ్యక్తుల ప్రాధాన్యతలను, తెలివితేటలను అర్థం చేసుకుని, రోజువారీ వ్యవహారాల్లో తోడ్పడే పరికరాలు సాకారమవుతాయి' అని నాదెళ్ల వివరించారు.
భవిష్యత్తులో మనుషులకు యంత్రాలు కష్టాలు తెచ్చే పరిస్థితి ఉండదని, రోజువారీ పనులు సాఫీగా జరిగేలా మనుషులతో కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. 'మనం రూపొందించే కృత్రిమ మేథస్సు మానవ సామర్థ్యాలు, అనుభవాలను పెంపొందించేలా ఉండాలి. అంటే మానవ వ్యతిరేకం కాకూడదు. మానవులతో కలిసి సాగేలా ఉండాలి' అని నాదెళ్ల ఆకాంక్షించారు.