శరణార్థుల అగచాట్లు: జంతువుల్లాగా (వీడియో)
సిరియా నుంచి సముద్ర తీరం శరణార్థులుగా వలస వచ్చిన వారికి అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని బయటి ప్రపంచానికి చెబుతున్న యూరప్ దేశాల్లో వాస్తవానికి అక్కడ జరుగుతున్నది వేరని ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. హంగేరిలో ప్రధాన శరణార్థ శిబిరంలోని దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శరణార్ధులను పెద్ద పెద్ద ఇనుప బోనుల్లో ఉంచారు. హంగేరి పోలీసులు శరణార్ధులను జంతువులకు వేసినట్టుగా ఆహారాన్ని విసిరేస్తూ కనిపిస్తున్నారు. శాండ్విచ్ పొట్లాల కోసం సుమారు 150 మంది శరణార్ధులు పోరాటం చేయాల్సిన పరిస్ధితి ఈ వీడియోలో చూడొచ్చు.
ఒక పెద్ద హాలులో చుట్టూ ఫెన్సింగ్ మధ్య హెల్మెట్లు ధరించిన హంగేరి పోలీసులు శరణార్ధులకు ఆహారం విసిరేస్తున్న వీడియోను ఆస్ట్రియా నుంచి వాలంటీర్గా వెళ్లిన ఓ మహిళ రహస్యంగా చిత్రీకరించింది. ఆహారం కోసం మహిళలు, చిన్నారులు చేతులు చాచి ఆర్జిస్తున్నారు.
"ఇక్కడి పరిస్థితి గ్వాంటనామోను తలపిస్తోంది. అక్కడి ఖైదీల మాదిరిగానే ఇక్కడ శరణార్థులను చూస్తున్నారు. జంతువులకు ఆహారం విసిరినట్టు విసిరేస్తున్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. ఇక్కడ ఉన్న వారిలో వేలాది మందికి రోజుకు ఒక్కపూట తిండి కూడా దక్కడం లేదు" అని వీడియోను చిత్రీకరించిన క్లౌస్ కుఫ్నర్ వ్యాఖ్యానించారు.