విషాదం: కుప్ప కూలిన మిలటరీ విమానం..ప్రయాణికులంతా మృతి
సుడాన్ : సుడాన్ దేశంలో ఓ మిలటరీ విమానం కుప్ప కూలింది. వెస్ట్ డర్ఫూర్ రాజధాని ఎల్జెనీనాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైంది. విమానం కూలడంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సూడాన్ దేశంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలతో చాలామంది గాయపడ్డారు. వారందరికీ చికిత్స అందించేందుకు ఒక బృందం రాజధాని ఎల్ జెనీనా నుంచి మిలటరీ విమానంలో బయలుదేరింది. ఈ క్రమంలోనే విమానం ప్రమాదానికి గురైందని ఆర్మీ ప్రతినిధి ఆమిర్ మొహ్మద్ అల్ హసన్ తెలిపారు. మృతి చెందిన వారిలో ఏడుగురు విమాన సిబ్బంది ఉండగా.. ముగ్గురు జడ్జీలు, ఎనిమిది మంది పౌరులు, నలుగురు పిల్లలు ఉన్నట్లు ఆమిర్ చెప్పారు.
కూలిన విమానం ఆంటొనవ్ 12 అని చెప్పారు ఆమిర్. అయితే విమాన ప్రమాదంకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఘటనపై విచారణకు ఆదేశించామని పూర్తి వివరాలు తర్వలో వెల్లడిస్తామని ఆమిర్ చెప్పారు. ఇదిలా ఉంటే సూడాన్లో రెండు వర్గాల మద్య జరుగుతున్న ఘర్షణల్లో ఈ వారంలోనే 48 మంది చనిపోయారు. మరో 241 మందికి గాయాలయ్యాయి. అరబ్ మరియు ఆఫ్రికన్ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి ఈ అల్లర్లు చెలరేగాయి. ఇక ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.