కరోనా లాక్డౌన్: 70 లక్షల మంది మహిళలకు అవాంఛిత గర్భధారణ! ఎందుకిలా జరుగుతోంది?
న్యూయార్క్: లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కరోనావైరస్ వ్యాప్తిని కొంత వరకు కట్టడి చేస్తున్నప్పటికీ ఇతర వ్యవస్థలన్నీ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
70 లక్షల మందికి గర్బం..
లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని యూనైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) తెలిపింది. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులకు దూరమైనట్లు అంచనా వేసింది. లాక్డౌన్ కారణంగా ఆరోగ్య సదుపాయాలకు, గర్భనిరోధక సాధనాలకు ఆటంకం కలగడంతో రాబోయే రోజుల్లో దాదాపు 70 లక్షల మంది అవాంఛిత గర్భధారణ పొందే అవకాశం ఉన్నట్లు యూఎన్ఎఫ్పీఏ వెల్లడించింది.
వేధింపులు మరింత పెరిగే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు ఇలాగే మరో ఆరు నెలల కొనసాగితే దాదాపు 4.7కోట్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక పద్ధతులకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు అనుసరించకపోవడం, అవాంఛిత గర్భధారణతోపాటు మహిళలపై వేధింపుల సంఘటనలు రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రభావం చూపిన ఈ కరోనా మహమ్మారితో రానున్న రోజుల్లో మహిళలు, బాలికల శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు యూఎన్ఎఫ్పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేమ్ వెల్లడించారు.
దేశాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..
ప్రపంచ వ్యాప్తంగా 114 అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 45 కోట్ల మంది గర్భనిరోధక సాధనాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించిన యూఎన్ఎఫ్పీఏ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. ఇలాంటి సమయంలో గర్భధరణకు అవకాశం ఉన్న మహిళల ఆరోగ్యం, వారికి కావాల్సిన వైద్య సదుపాయాలపై వివిధ దేశ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలు, పిల్లల ఆరోగ్యం పట్ల దేశాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
Recommended Video