హత్యా? ఆత్మహత్యా?: హాస్టల్ గదిలో పాక్ మైనార్టీ యువతి మృతదేహం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మళ్లీ మైనార్టీల చెందిన అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సిక్కు మతంకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి వివాహం చేసిన ఘటన మరువకముందే మరో హిందూ మతంకు చెందిన యువతిని హత్యచేసిన ఘటన వెలుగు చూసింది. మృతదేహం హాస్టల్ గదిలో కనిపించింది.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నమ్రితా చాందిని అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో పడిఉండటం కనిపించింది. ఆ సమయంలో తన గొంతుకు ఏదో బట్ట కట్టి ఉన్నట్లుగా ఉంది. ఆమె గది కూడా లోపల నుంచి తాళం వేసి ఉంచారు. అయితే ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేశారు.కానీ నమ్రితా కుటుంబసభ్యులు మాత్రం తన బిడ్డది ముమ్మాటికీ హత్యే అని చెబుతున్నారు. స్వయంగా డాక్టర్ అయిన నమ్రితా సోదరుడు విశాల్, ఆమెను పరీక్షించి అది హత్యే అని ప్రాథమిక అంచనాకు వచ్చాడు.
గొంతుపై కేబుల్ వైర్ల గుర్తులు
అది ఆత్మహత్యకాదని ఆత్మహత్యకు హత్యకు తేడా ఉంటుందని చెప్పారు.ఆమె గొంతు చుట్టూ కేబుల్ వైర్ గుర్తులు ఉన్నట్లు తెలిపారు డాక్టర్ విశాల్. ఇక చేతులపై కూడా కేబుల్ వైర్ గుర్తులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. శరీరంపై కేబుల్ వైర్ గుర్తులున్నాయని అయితే నమ్రితా స్నేహితురాలు మాత్రం ఆమె చూసేసరికి గొంతు చుట్టూ చున్నీ ఉన్నట్లు చెబుతోందని డాక్టర్ విశాల్ చెప్పారు. ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని రెండ్రోజుల క్రితం తానే స్వయంగా నమ్రితాతో మాట్లాడినట్లు డాక్టర్ విశాల్ తెలిపారు. తన సోదరి హత్యపై విచారణ జరపాలని పౌరులు ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
మృతిపై తలెత్తుతున్న అనుమానాలు
ఈ మధ్యే గోట్కీ ప్రాంతంలో ఓ ఆలయంను ధ్వంసం చేశారు కొందరు. ఇక మృతి చెందిన నమ్రితా కూడా ఈ ప్రాంతంకు చెందినదే. ఓ కాలేజీకి చెందిన హిందూ మైనార్టీ ప్రిన్సిపల్ మరో సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఆలయంను ధ్వంసం చేశారు. అయితే నమ్రిత మృతి విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. బలవంతంగా మతం మార్పిడికి పాల్పడే క్రమంలో ఆమెపై అత్యాచారం చేశారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
పాక్ మానవహక్కుల కమిషన్ చెబుతోందేమిటి.?
ఏటా సిందు ప్రావిన్స్లో నివసిస్తున్న 12 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారితో బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడేలా చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఏటా వెయ్యిమంది కిడ్నాప్ అవుతున్నారు. పాకిస్తాన్ మానవహక్కుల నివేదిక ప్రకారం 2004 నుంచి 2018 వరకు ఒక్క సింధి ప్రాంతంనుంచే ఇలాంటి కేసులు 7,430 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారిక సమాచారం మాత్రమే. ఇంకా లెక్కలోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి.