వావ్ గ్రేట్ జాబ్: కరోనా బాధితుల కోసం స్టెతోస్కోప్ చేతపట్టిన మిస్ ఇంగ్లాండ్ భాషా ముఖర్జీ
లండన్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వేల సంఖ్యలో ప్రజలప్రాణాలను బలిగొంది. కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచదేశాలు లాక్డౌన్ విధించాయి. ఇక అప్పటి నుంచి ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వీలైనంతగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు ఈ విపత్కర సమయంలో చాలామంది సేవచేసేందుకు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయం. ఎప్పుడో వీడిన డాక్టర్ వృత్తిని ఈ విపత్కర సమయాల్లో తిరిగి చేత్తో స్టెతోస్కోప్ పట్టుకుని పేషెంట్లకు చికిత్స అందించడం చాలా గొప్ప విషయం. అలాంటి ఘటనే బ్రిటన్లో చోటుచేసుకుంది.
స్టెత్ చేతపట్టిన మిస్ ఇంగ్లాండ్ 2019 భాషా ముఖర్జీ
ప్రస్తుతం కరోనావైరస్తో యూకే విలవిలలాడుతోంది. రోజు రోజుకూ కోవిడ్ -19 మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఎంతో మంది ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కొందరు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. అప్పుడెప్పుడో స్టెతోస్కోప్ చేతపట్టి ఆ తర్వాత మరో రంగంలోకి అడుగుపెట్టిన వారు తిరిగి డాక్టర్లుగా తమ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మిస్ ఇంగ్లాండ్ 2019 విజేత భాషా ముఖర్జీ. స్వతహాగా మెడిసిన్ చదివినభాషా ముఖర్జీ ఒక డాక్టర్. ప్రస్తుతం యూకేను కరోనావైరస్ కుదిపేస్తోంది. అక్కడ మృతుల సంఖ్యకూడా క్రమంగా పెరిగిపోతోంది. దీంతో చలించిపోయిన భాషా ముఖర్జీ తిరిగి స్టెత్ పట్టుకోవాలని నిర్ణయించుకుంది. తనవంతు సేవచేయాలని డిసైడ్ అయిపోయింది.
భారత్ పర్యటనలో ఉండగా...
స్వతహాగా డాక్టరు అయిన భాషా ముఖర్జీ మెడిసిన పూర్తి కాగానే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. పలు టాప్ బ్యూటీ పేజెంట్స్లో కూడా ఆమె పాల్గొనింది. గతేడాది ఆగష్టులో జరిగిన మిస్-ఇంగ్లాండ్ -2019 పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. అనంతరం పలు చారిటీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చింది. తన ఛారిటీ కార్యక్రమంలో భాగంగా ఆఫ్రికా దేశాలు, టర్కీ దేశాలను చుట్టేసినట్లు చెప్పిన భాషా ముఖర్జీ... ఇక భారత్లో కూడా పర్యటించినట్లు చెప్పింది. నాలుగు వారాల పాటు భారత్లో పర్యటించారు ముఖర్జీ . ఆ సమయంలోనే యూకేలో కరోనావైరస్ తీవ్రతరం అవుతోందని బోస్టన్లో తాను పనిచేసిన పిల్గ్రిమ్ హాస్పిటల్ సహోద్యోగి మెసేజ్ చేయడంతో వెంటనే హాస్పిటల్కు వెళ్లి సేవచేయాలని నిర్ణయంతీసుకున్నట్లు భాషా ముఖర్జీ చెప్పారు.
కోల్కతాలో పుట్టిన భాషా ముఖర్జీ
కరోనావైరస్తో ప్రాణాలు కోల్పోతుంటే తాను మాత్రం మిస్ ఇంగ్లాండ్ కిరీటం ధరించి దేశాలు తిరగడం బాగుండదని, స్వతహాగా డాక్టర్ అయిన తాను సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక యూకేకు చేరుకుని రెండు వారాలపాటు స్వీయనిర్బంధంలో ఉండి అనంతరం పిలిగ్రిమ్ హాస్పిటల్లో చేరుతానని చెప్పారు. ఇదిలా ఉంటే భాషా ముఖర్జీ కోల్కతాలో జన్మించింది. తాను 9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తన కుటుంబం యూకేకు వలసపోయింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది భాషా ముఖర్జీ. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేసింది. బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. 17 ఏళ్ల వయస్సులోనే భాషా ముఖర్జీ ఓ ఛారిటీ ప్రారంభించింది.
Recommended Video