తాజ్ బెంచీపై చెప్పులు, విశ్వసుందరి క్షమాపణ
హైదరాబాద్: తాజ్ మహల్ వద్ద బ్రాండెడ్ చెప్పుల కంపెనీకి ఫోటో షూట్ చేసిన విశ్వ సుందరి ఒలీవియా కల్పో భారత్కు క్షమాపణ చెప్పింది. ఒలీవియా వాణిజ్య ప్రకటనల కోసం ఫోటోలు దిగలేదని, కేవలం అభిమానుల కోసం రూపొందిస్తున్న ఆల్బమ్ కోసమే ఆ పని చేసిందని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ వివరణ ఇచ్చింది.
అయినా ఈ సంఘటన భారతీయుల మనోభావాలను గాయపరిచిందని, దీనికి క్షమాపణలు చెపుతున్నామని ప్రకటించింది. తన పది రోజుల పర్యటనలో భాగంగా ఓలివియా కల్పో ఆదివారంనాడు తాజ్ మహల్ను సందర్శించింది.
తాజ్ మహల్లో వాణిజ్యపరమైన కార్యక్రమాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. అందుకే, బ్రాండెడ్ కంపెనీ చెప్పులతో ఫొటోలకు పోజిచ్చిన విశ్వ సుందరిపై కేసు నమోదు చేశారు. అర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటనకు గుర్తుగా తాజ్లోని ఓ పాలరాతి బెంచీకి 'డయానా సీట్' అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఈ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. కల్పో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.