డిసెంబర్ 30న అదృశ్యం: మృతదేహంగా గుజరాతీ ఎన్నారై మహిళ.. సొంత కారు డిక్కీలో.. !
న్యూయార్క్: కొద్ది రోజుల కిందట అదృశ్యమైన ప్రవాస భారతీయురాలు ఒకరు మృతదేహంగా కనిపించారు. ఆమె సొంత కారు డిక్కీలో మృతదేహం లభించింది. దుప్పటిలో చుట్టిన స్థితిలో కనిపించిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. అమెరికా చికాగో సమీపంలోని షాంబర్గ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. మిస్సింగ్గా కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. దాన్ని అనుమానాస్పద మృతిగా బదలాయించారు.
మృతురాలి పేరు సురీల్ డాబావాలా. చికాగోలోని లయోలా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని. ఎంబీఏను పూర్తి చేసిన సురీల్.. చికాగో సమీపంలోని షాంబర్గ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. సురీల్ తండ్రి డాక్టర్ అష్రాఫ్ అదే ప్రాంతంలో ఫిజీషియన్గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ క్లినిక్ను నడిపిస్తున్నారు. తల్లి కూడా డాక్టరే. ఇల్లినాయిస్లో ఆమె నివసిస్తున్నారు. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతం షాంబర్గ్.
గత ఏడాది 30వ తేదీ నుంచి సురీల్ కనిపించకుండాపోయారు. తన కుమార్తె కనిపించట్లేదంటూ ఆ మరుసటి రోజే ఆమె తండ్రి డాక్టర్ అష్రాఫ్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకవంక సురీల్ గురించి అన్వేషణ కొనసాగిస్తుండగానే.. ఆమె మృతదేహం లభించింది. చికాగో సమీపంలోని వెస్ట్ గార్ఫీల్డ్ పార్క్ సమీపంలో ఈ కారును గుర్తించారు పోలీసులు.
కారు డిక్కీలో ఓ దుప్పటిలో చుట్టి ఉన్న స్థితిలో సురీల్ డాబావాలా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. సురీల్ మరణించడానికి గల కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు. పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఓ నిర్ధారణకు రాగలుగుతామని పోలీసులు చెబుతున్నారు. మిస్సింగ్ కేనును కాస్తా అనుమానాస్పద మృతిగా బదలాయించారు. ఆ కేసులో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. ఇప్పటిదాకా ఎవ్వర్నీ అరెస్టు చేయలేదు.