భారత టెక్కీ తరుపున పోరుడుతూ కిడ్నాపైన పాక్ మహిళా జర్నలిస్ట్ విడుదల
రెండేళ్ల క్రితం అదృశ్యమైన పాకిస్తాన్ సంచలన జర్నలిస్టు జీనత్ షాజాదీ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం పాక్ సరిహద్దుల్లో కొందరు బలుచిస్తాన్ యువకులు, గిరిజనుల సాయంతో అసాంఘిక శక్తుల చెర నుంచి ఆమెను విడి
లాహోర్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన పాకిస్తాన్ సంచలన జర్నలిస్టు జీనత్ షాజాదీ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం పాక్ సరిహద్దుల్లో కొందరు బలుచిస్తాన్ యువకులు, గిరిజనుల సాయంతో అసాంఘిక శక్తుల చెర నుంచి ఆమెను విడిపించారు.
ప్రేమంటే ఇదేరా: దొంగచాటుగా పాకిస్తాన్ కు, పట్టుబడి నాలుగేళ్ళుగా జైలులోనే, ఓ ఇంజినీరు వీర ప్రేమగాథ
'నయీ ఖబర్' అనే దినపత్రికలో స్థానిక రిపోర్టర్గా పనిచేస్తున్న జీనత్ (26) షాజాదీ గూఢచార్యం ఆరోపణలపై పాకిస్తాన్ లో అరెస్టయిన భారతీయ టెక్కీ హమీద్ అన్సారీ కేసును భుజానికెత్తుకున్నారు.
ఈ క్రమంలో హమీద్ కోసం ఆయన తల్లి ఫౌజియా అన్సారీ తరఫున సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంలో జీనత్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 2015 ఆగస్టు 19న ఆటోలో పత్రికా కార్యాలయానికి వెళుతున్న జీనత్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ఐటీ ఇంజినీర్ హమీద్ అన్సారీ ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్తాన్ కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమకు అంగీకారం తెలుపడంతో పాకిస్తాన్ వెళ్లి తన ప్రియురాలిని కలుసుకోవాలని అనుకున్నాడు.
పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా లభించకపోవడంతో ఎలాగైనా తన ప్రియురాలని కలుసుకోవాలని భావించిన హమీద్ అన్సారీ 2012 నవంబర్ 4న అక్రమంగా కాబూల్ చేరుకొన్నాడు.
అతడి ఆన్లైన్ ఫ్రెండ్స్ కోహత్ అనే పట్టణంలోని ఓ హోటల్లో అతడికి వసతి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2012 నవంబర్ 14న హమీద్ను పోలీసులు అరెస్ట్ చేసి పాకిస్తాన్ భద్రతా బలగాలకు అప్పగించారు.
వారు అతడిపై గూఢచర్యం కేసు బనాయించి జైల్లో పడేశారు. కుమారుడ్ని విడిపించుకునేందుకు హమీద్ తల్లికి పాకిస్తాన్ మహిళా రిపోర్టర్ జీనత్ అండగా నిలిచారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంగా హమీద్ తల్లితరుపున జీనత్ కేసు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి రిపోర్టర్ జీనత్ అదృశ్యం కావడం అప్పట్లో సంచలనం రేపింది. రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లలో తన అక్క ఆచూకీ తెలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించి.. విసిగిపోయి.. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె తమ్ముడు సద్దాం ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.
చివరికి రెండేళ్ల తరువాత రిపోర్టర్ జీనత్ షాజాదీ అంసాంఘిక శక్తుల చర నుంచి విడుదలయ్యారు. ఆమె లాహోర్లోని తన ఇంటికి చేరుకున్నారు. ఆమెను కుటుంబ సభ్యులతో కలపడం ఆనందంగా ఉందని బీనా సర్వర్ అనే సామాజిక కార్యకర్త పేర్కొన్నారు.
మరోవైపు ప్రియురాలిని కలుసుకునేందుకు అక్రమంగా పాకిస్తాన్ లోకి చొరబడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హమీద్ అన్సారీ ఇప్పటికీ పాక్ లోని జైలులో మగ్గిపోతున్నాడు. అతని విడుదల కోసం పాక్ మానవహక్కుల నేత రెహ్మాన్ పోరాడుతున్నారు.